పోసాని కృష్ణమురళి విడుదల.. 24 రోజుల తర్వాత ఇంటికి , బెయిల్ కండీషన్స్ ఇవే?
సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ వ్యవహారం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నారంటూ నమోదైన ఫిర్యాదుపై పోసాని అరెస్ట్ అయ్యారు. నాటి నుంచి జైళ్లోనే ఆయన గడుపుతున్నారు. అన్నింటికి మించి పలు కేసుల్లో ఆయనను హాజరుపరుస్తుండటం, పీటీ వారెంట్లు, సీఐడీ రంగ ప్రవేశం వంటి అంశాలతో పోసాని కృష్ణమురళి అసలు బెయిల్పై బయటకు వస్తారా? రారా? అంటూ ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు.
జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో కృష్ణమురళిని అదుపులోకీ తీసుకున్నారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు. తదనంతరం పోసానిని రైల్వే కోడూరు జైల్లో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆ సమయంలోనే పోసాని బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళీపై కేసులు నమోదు కావడంతో పోలీసులు పలు ఏరియాలకు తిప్పుతూ, కోర్టులలో హాజరుపరుస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోసాని విడుదల అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో పోసాని బెయిల్కు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాలేదని, తనకు బెయిల్ మంజూరు చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని న్యాయమూర్తి ఎదుట పోసాని కృష్ణమురళి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సీఐడీ విజ్ఞప్తి మేరకు గత మంగళవారం పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది.
మరోసారి మార్చి 21న పోసాని కృష్ణమురళికి సీఐడీ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారమే పోసాని విడుదలవుతారని అంతా భావించారు. అయితే లీగల్ ప్రక్రియ కారణంగా ఆలస్యమైంది. చివరికి మార్చి 22న అన్ని రకాల లాంఛనాలు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం తన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నివాసానికి బయల్దేరి వెళ్లారు పోసాని .
అయితే పోసాని కృష్ణమురళికి గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ కండీషన్స్ ఏంటంటే.. రూ.2 లక్షల విలువతో ఇద్దరు ష్యూరిటీ ఇవ్వడంతో పాటు జైలు నుంచి విడుదలయ్యాక దేశం విడివి వెళ్లరాదని కోర్ట్ ఆదేశించింది. కేసు గురించి, దర్యాప్తు గురించి ఎక్కడా మాట్లాడకూడదని సూచించింది. అలాగే నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని పోసానిని ఆదేశించింది. దాదాపు 24 రోజుల నిరీక్షణ తర్వాత పోసాని విడుదల కావడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.


Click it and Unblock the Notifications











