భారతి కళ్లలో ఆనందం కోసమే రుషికొండ ప్యాలెస్.. సినిమా హాల్ లేపేశారు.. వైఎస్ జగన్పై యాక్టర్ సమీర్ మాస్ ర్యాగింగ్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. టికెట్ ధరలు తగ్గించడంతో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోల వంటి వాటికి జగన్ నో పర్మిషన్ అని చెప్పేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చొరవ చూపి నాగార్జున , మహేశ్ బాబు, ప్రభాస్, దిల్రాజు వంటి వారిని తీసుకుని స్పెషల్ ఫ్లైట్లో బెజవాడలో దిగారు. అయితే తాడేపల్లి ప్యాలెస్ గేటు బయటే హీరోలు తమ కార్లను పార్క్ చేసి అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ రావడం, చిరంజీవి జగన్కు చేతులు జోడించి వేడుకోవడాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నటికీ మరిచిపోదు.
ప్రస్తుతం ఏపీలో టాలీవుడ్కు అత్యంత అనుకూలమైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు సినీ ప్రముఖులు జగన్ పాలనపై , ఆయన నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యేకించి విశాఖపట్నంలోని రుషికొండ ఏరియాలో నిర్మించిన భవనాలపైనా వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని మూలనపడేసి మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రతిపాదించారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిలు ఏర్పాటు చేయాలని ఆయన భావించారు.

అయితే తాను విశాఖకు మకాం మారిస్తే నివసించేందుకు పరిపాలనకు వీలుగా రుషికొండపై విలాసవంతమైన, రాజభవనాలను తలపించే బిల్డింగ్లను జగన్ నిర్మించారు. నిబంధనలను గాలికొదిలి రుషికొండకు బోడిగుండు కొట్టారని అప్పట్లో విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో అసలు రుషికొండ ప్యాలెస్లో ఏముందనేది ప్రజలకు తెలియజేసింది. విశాలమైన రాజప్రాసాదాన్ని తలపించేలా, అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ భవనం ఫోటోలు, వీడియోలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
ఈ వ్యవహారంలో సినీరంగానికి చెందిన మాజీ మంత్రి రోజా పేరు సైతం వినిపించింది. పర్యాటక శాఖ మంత్రిగా రుషికొండ నిర్మాణాల వెనుక ఆమె హస్తం ఉందని, కాంట్రాక్టర్ల వద్ద భారీగా ముడుపులు అందుకుని రోజా బెంజ్ కారు కొనుగోలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు సమీర్. విశాఖపట్నానికే చెందిన ఆయన అసలు మూడు రాజధానులు, రుషికొండపై జగన్ ప్యాలెస్ ఎందుకు కట్టారో వివరించారు.

తన సతీమణి వైఎస్ భారతి రుషికొండపై నుంచి చూస్తే బీచ్ కనిపించాలని కోరడంతో జగన్ ప్యాలెస్ కట్టారని సమీర్ ఆరోపించారు. జగన్కు భారతి చెప్పినదే వేదమని, ఆవిడను కాదని ఆయన ఏం చేయరని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా వైసీపీ నేతల మధ్యే ఎన్నో గొడవలు జరిగాయని సమీర్ చెప్పారు. జగన్ ఎవరినీ నమ్మరని.. కానీ పైకి మాత్రం అందరినీ మంచివాడు, సౌమ్యుడు అంటూ మెచ్చుకుంటూ ఉంటారంటూ సెటైర్లు వేశారు.
సహజంగా ఒక సినిమా జనానికి నచ్చకపోతే.. అది తీసేసి మరో మూవీ వేస్తారని, కానీ ఏపీలో మాత్రం హాలే లేపేశారంటూ పరోక్షంగా వైసీపీ ఓటమిపై సమీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అన్నట్లు .. జగన్ లాంటి వాళ్లు యుగానికి ఒకడు పుడతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం సమీర్ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ జనాలు మాత్రం సమీర్పై భగ్గుమంటున్నారు.


Click it and Unblock the Notifications











