పవన్ కోసం అమరావతికి ముంబై నటుడు.. ఏపీ ఆలయాల్లో ప్రసాదంపై సలహా!
తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో వెంటనే రాజకీయ రంగు పులుముకుంది. ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు తప్పు మీదంటే మీదంటూ కొట్టుకుంటున్నాయి. దీనికి తోడు డిక్లరేషన్ వ్యవహారం తెరమీదకి రావడంతో అక్కడ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు షాయాజీ షిండే ప్రసాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు ఓ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ద్వారా తెలుగువారిని పలకరించారు షాయాజీ షిండే. ఆ వెంటనే ఆంధ్రావాలా, సూపర్, అతడు, రాఖీ, పోకిరి, లక్ష్మీ, చిరుత, దుబాయ్ శీను, నేనింతే, ఆర్య 2, కిక్, అరుంధతి, అదుర్స్, ఊసరవెల్లి, శక్తి, బిజినెస్మెన్, బాద్షా, ఒక లైలా కోసం, బెంగాల్ టైగర్, ధ్రువ, కిరాక్ పార్టీ, వకీల్ సాబ్, గాడ్సే, గాడ్ ఫాదర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేసిన షిండే.. తనకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఆయన హవా తగ్గింది.

చాలా రోజుల తర్వాత బిగ్బాస్ ప్రొగ్రామ్ ద్వారా తెలుగువారిని పలకరించారు షాయాజీ షిండే. సుధీర్ బాబు హీరోగా నటించిన మా నాన్న సూపర్ హీరో సినిమా ప్రమోషన్స్లో భాగంగా గత ఆదివారం బిగ్బాస్ స్టేజ్పై హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆర్నాలతో కలిసి పాల్గొన్నారు షిండే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మొక్కలు నాటే కార్యక్రమం గురించి వెల్లడించారు. మా అమ్మగారు బతికున్నప్పుడు నా దగ్గర ఇంత డబ్బు ఉందని, కానీ ఆమెను బతికించుకోలేకపోయానని అందుకే ఆవిడ బరువుకు సమానమైన విత్తనాలను తీసుకుని ఇండియా మొత్తం నాటుతున్నట్లు చెప్పారు.
Deputy CM, JanaSena Chief Sri Pawan Kalyan garu has expressed his support for Sri Sayaji Shinde's proposal to offer a plant along with Prasadam in Temples. Within two days @PawanKalyan garu met with Sri Sayaji Shinde to discuss the idea.#PawanKalyanAneNenu pic.twitter.com/r8U0Ne50iY
— JanaSena Party (@JanaSenaParty) October 8, 2024
ఆలయాలకు వెళ్లినప్పుడు ప్రసాదాలు పంచి పెడతారని.. కానీ ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే చాలా బాగుంటుందని షిండే తెలిపారు. మహారాష్ట్రలోని మూడు ఆలయాల్లో ప్రయోగాత్మకంగా తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరికితే తాను ఈ సలహా చెబుతానని ఆయన బిగ్బాస్ స్టేజ్పై చెప్పారు. కట్ చేస్తే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో షాయాజీ షిండే ప్రత్యక్షమయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసిన ఆయన రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను ఇవ్వాలని సూచించారు. దీనిపై జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసింది. షాయాజీ ఇచ్చిన సూచనను పవన్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయిన ప్రముఖ నటులు శ్రీ షాయాజీ షిండే గారు.
— JanaSena Party (@JanaSenaParty) October 8, 2024
ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని శ్రీ షాయాజీ షిండే గారు ఇటీవల తెలిపి... శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి… pic.twitter.com/858gZWucNA
కాగా.. ఏపీలో అక్టోబర్ 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పల్లె పండుగ అమలుపై ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పనుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని.. నీటి ఎద్దడిని నివారించేందుకు చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించాలని డిప్యూటీ సీఎం సూచించారు.


Click it and Unblock the Notifications











