ముసలాయనికి భయపడ్డారా? పడుకున్నారా?...ఇచ్చిపడేసిన మాధవీలత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, నవ్యాంధ్ర అయినా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గా ఉంటాయి. రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గాన్ని గుర్తించిందంటే తాడిపత్రిలో పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాక్షన్ రాజకీయాలకు , పగలు, ప్రతీకారాలు, దాడులు, ప్రతిదాడులు, హత్యలకు పెట్టింది పేరైన తాడిపత్రిలో ఎన్నికలు వస్తున్నాయంటే చాల అధికార యంత్రాంగానికి ముచ్చెమటలు పడతాయి.
కాంగ్రెస్ పార్టీకి తాడిపత్రి కంచుకోట. జేసీ దివాకర్ రెడ్డి రంగ ప్రవేశం తర్వాత ఇక్కడి పరిస్ధితులన్నీ మారిపోయాయి. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జేసీ కుటుంబానిదే ఇక్కడ ఆధిపత్యం. తాడిపత్రిని అడ్డాగా చేసుకుని రాష్ట్ర రాజకీయాలను శాసించారు జేసీ బ్రదర్స్. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ దిగ్గజాల్లో ఒకరిగా వెలుగొందిన జేసీ దివాకర్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీలో చేరారు.

2014 నుంచి 19 వరకు టీడీపీ పవర్లో ఉండటంతో జేసీ గాలి ఇక్కడ బలంగా వీచింది. అయితే 2019లో వైసీపీ గెలిచి జగన్ అధికారంలోకి రావడమే కాదు.. తొలిసారిగా తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యుడు కాకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించడంతో జేసీ బ్రదర్స్ హవాకు చెక్ పడింది. పెద్దారెడ్డితో ఫ్యాక్షన్ గొడవలకు తోడు, కోర్టు కేసులను ఈ కుటుంబం ఎదుర్కోంది. అయితే జగన్ ప్రభంజనంలో రాష్ట్రంలోని స్థానిక ఎన్నికలన్నీ వైసీపీ గెలవగా.. జేసీ బ్రదర్స్ మాత్రం తాడిపత్రిలో తమ పట్టు నిలుపుకోవడమే కాదు తెలుగుదేశం పార్టీకి పరువు నిలబెట్టారు. 2024 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేసీ ఫ్యామిలీ మరోసారి దూకుడు రాజకీయాలు చేస్తోంది.
ఎప్పుడూ రాజకీయాలు, ప్రత్యర్ధులపై విరుచుకుపడే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు ఇప్పుడు కలకలం రేపుతోంది. సినీ నటి , బీజేపీ నేత మాధవీలతపై ఆయన కామెంట్స్ సినీ, రాజకీయ రంగాల్లో దుమారం రేపుతున్నాయి. తనపై జేసీ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవీలత .. వెంటనే వీడియోను రిలీజ్ చేసి కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో నటించేవారంతా వ్యభిచారులు కాదని.. ప్రభాకర్ రెడ్డి వయసుకు నేను గౌరవం ఇస్తానని , అంతే తప్పించి తాను ఎవరికీ భయపడనని ఆమె తేల్చి చెప్పారు. నన్ను కిడ్నాప్ చేసి హత్య చేస్తారా? 100 కేసులు పెడతారా పెట్టుకోండి అంటూ మాధవీలత మండిపడ్డారు.
అయితే ఇంత జరుగుతున్నా ఓ మీడియా తనను పట్టించుకోవడం లేదని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది . పచ్చ మీడియా నా విషయంలో ఎందుకు మౌనంగా ఉంది.. తెలుగుదేశం వాళ్లు బూతులు మాట్లాడితే వినిపించలేదా? జగన్ రెడ్డి మంచోడిలా మారితే కనిపించలేదు? ముసలాయన మాటలకి భయపడ్డారా? గత పాలనలో గలీజ్, చండాలం అని నోరు చించుకుని అరిచిన మీడియా నోరు నా విషయంలో ఎందుకు మూతపడిందని మాధవీలత ప్రశ్నించారు.
ఈ పెద్ద విలేఖరులు కూడా నా మిత్రులే కానీ.. పచ్చమీడియాలో ఉండటంతో మౌనం పాటిస్తున్నారా? పక్క పార్టీ మీద లేచిన నోర్లు సొంత పార్టీ నాయకుల విషయంలో ఎందుకు పడుకున్నాయి అంటూ ఆమె మండిపడ్డారు. ఇదేనా మీ ద్వంద నీతి? మీ విధానం సమ్మతంగా లేదని.. సెలెక్టివ్ జర్నలిజం చేస్తున్నారనే అనుమానం వస్తుందని, ధర్మం తప్పుతున్నారంటూ మాధవీలత దుయ్యబట్టారు. మరి ఈ వివాదం రాను రాను ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











