బీఆర్ఎస్కు పాకిన రప్పా రప్పా.. అల్లు అర్జున్ డైలాగ్తో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 చిత్రంలోని గంగమ్మ జాతరలో పొట్టేలును కోసినట్టు రపా రపా నరుకుతా అనే డైలాగ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను వేడుక్కించిన సంగతి తెలిసిందే. ఈ డైలాగ్తో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాజీ సీఎం, వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ వైసీపీ శ్రేణులు ఈ డైలాగ్ ఉన్న పోస్టర్ను ప్రదర్శించారు. అల్లు అర్జున్ డైలాగ్ను మార్చి 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో పొట్టేలును నరికినట్లు ఒక్కోక్కడిని రపా రపా నరుకుతాం అంటూ హల్చల్ చేశారు.
రప్పా రప్పా చుట్టూ ఏపీ రాజకీయాలు
ఈ డైలాగ్ ఉన్న పోస్టర్పై వివాదం నెలకొనడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవడంతో ఈ ఫ్లకార్డ్ ప్రదర్శించిన రవితేజ అనే వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులతోనే డైలాగ్ చెప్పించారు. ఆయన కూడా డైలాగ్ చెబుతూ అల్లు అర్జున్ మాదిరిగా గడ్డం కింద చేయి పెట్టుకుని నవ్వులు పూయించారు. సినిమా డైలాగ్ను పోస్టర్గా పెట్టుకోకూడదా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా అంటూ మండిపడ్డారు జగన్.

జగన్పై బాబు, పవన్ ఆగ్రహం
జగన్ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సంఘ వ్యతిరేక శక్తులకు మద్ధతుగా నిలిచినట్లుగా జగన్ తీరు ఉందని.. టీడీపీ వాళ్లను చంపుతామంటూ ఫ్లకార్డులు ప్రదర్శించడం సరికాదన్నారు. సినిమాలలో చెప్పే డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయని.. వాటిని నిజంగా ఆచరిస్తామంటే కూటమి ప్రభుత్వం ఊరుకోదని జగన్ హెచ్చరించారు. ఇలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అదుపు చేస్తామని.. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిని సమర్ధించేలా మాట్లాడేవారిని ప్రజలు గమనించాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. చట్ట విరుద్ధమైన పనులు చేసే వారికి మద్ధతుగా మాట్లాడటం కూడా నేరమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ టీడీపీ - వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ధర్నా
తాజాగా ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పాకింది. రాష్ట్రంలోని రైతు సమస్యలు పరిష్కరించాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు శనివారం సంగారెడ్డి జిల్లాలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, రైతు సంఘాల నేతలు తరలివచ్చారు. గులాబీ దళం కూడా కదం తొక్కుతూ హరీష్కు మద్ధతు పలికారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో జరిగిన ఈ కార్యక్రమంలో హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేడర్ ప్రదర్శించిన పోస్టర్లు కలకలం రేపాయి.
రప్పా రప్పా డైలాగ్ను వాడిన బీఆర్ఎస్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2లోని రప్పా .. రప్పా డైలాగ్ను అనుకరించి.. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఇవి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చేలా ఈ పోస్టర్ ఉందంటూ హస్తం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనికి బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. చూస్తుంటే ఈ రప్పా రప్పా డైలాగ్ తెలంగాణలోనూ కలకలం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











