2 ఎకరాలు.. 2 లక్షల కోట్లు.. చంద్రబాబుపై యాంకర్ శ్యామల ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సినీ పరిశ్రమకు గట్టి వాయిస్గా నిలబడిన వారిలో యాంకర్ శ్యామల ఒకరు. వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలు ఉండటంతో జగన్కు గట్టి మద్ధతుదారుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ - జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో శ్యామల సైలెంట్ అయ్యారు. అయితే ఆమె సేవలను గుర్తించిన జగన్ తాజాగా శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ వివరాల్లోకి వెళితే..
తన షోలు, సినిమా ఈవెంట్లు, సినిమాల్లో చిన్నాచితకా ఈవెంట్లతో మంచి పాపులారిటీ సంపాదించారు శ్యామల. క్లీవేజ్ షోకు దూరంగా సాంప్రదాయబద్ధంగా కనిపించేవారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయినా శ్యామల అందం కొంచెం కూడా తగ్గలేదు. తన భర్త నరసింహారెడ్డి వైసీపీకి మద్ధతుదారు కావడంతో ఆమె కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచారు. వైఎస్ కుటుంబంతో శ్యామల ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్, షర్మిల పాదయాత్రలలో నరసింహారెడ్డి, శ్యామల కనిపించిన సంగతి తెలిసిందే.

జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన శ్యామల.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో వైసీపీ తరపున ప్రచారం చేశారు . ఈ సందర్భంగా ఓ ఛానెల్లో మాట్లాడుతూ .. ముసలి తోడేలు, గుంట నక్క కథ చెప్పింది. ఇది పరోక్షంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్లను ఉద్దేశించినదేనంటూ రెండు పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. తీరా ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి రావడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమెస్తోందని తనను బతకనీయండి అన్నా అంటూ శ్యామల ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్ .. పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను మారుస్తున్నారు. తాజాగా పార్టీ వాయిస్ని బలంగా వినిపించే వారికి కీలక బాధ్యతలు కట్టబెడుతున్నారు జగన్. దీనిలో భాగంగా కొత్తగా నలుగురిని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వారే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామల. దీనిపై స్పందించిన శ్యాంకర్. తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలా పదవి దక్కిందో లేదో వెంటనే యాక్షన్లోకి దిగిపోయారు శ్యామల. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు సాయం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డిపై పిల్లికి కూడా బిచ్చం వేయని చంద్రబాబు, నారా లోకేష్ల సన్నాయి నొక్కులు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావడం లేదన్నారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు పైగా సంపాదించుకున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎంతమందికి సాయపడ్డారని శ్యామల ప్రశ్నించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతీకార దాడుల్లో నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ సాయాన్ని అందించారని ఆమె తెలిపారు. విశాఖలోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే.. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడ్డ 41 మందికి లక్ష చొప్పున జగన్ సాయం అందించారని శ్యామల వెల్లడించారు. విజయవాడలోని వరద బాధితులకు ఇప్పటికీ సాయం అందుతోందని, పులివెందులోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మరి శ్యామల వ్యాఖ్యలకు టీడీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











