కొత్త అవతారంలో పవన్ కల్యాణ్.. వారాహి అమ్మవారి దీక్షలోనే పవర్ స్టార్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ బంపర్ విక్టరీలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం. ఈసారి ఎన్నికలు జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా జరిగాయి. అభిమానుల పదేళ్ల నిరీక్షణ ఫలించి పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని ఘన విజయం సాధించారు.
తనే కాదు తాను నిలబెట్టిన 21 మంది జనసేన అభ్యర్ధులను కూడా గెలిపించి భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను స్వీకరించారు.

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో పరిస్ధితుల దృష్ట్యా అప్పటి టీడీపీ - బీజేపీ కూటమికి జనసేనాని మద్ధతు తెలిపారు. 2019లో కూటమి నుంచి బయటకు వచ్చి లెఫ్ట్, బీఎస్పీ నేతల మద్ధతుతో పోటీ చేశారు. తాను భీమవరం, గాజువాకలలో పోటీ చేయగా.. రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.
జనసేన ఓటమి కంటే పవన్ పరాజయం పాలవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు, పవర్స్టార్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ పడి లేచిన కెరటం మాదిరి ఆ క్షణం నుంచే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోరాడారు పవన్ కళ్యాణ్. అన్ని విధాలుగా శక్తివంతుడైన వైఎస్ జగన్ను ఓడించాలంటే తన బలం చాలదని గ్రహించి టీడీపీ, బీజేపీలతో జత కట్టారు.

ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ''వారాహి ''వాహనం. తన యాత్రల కోసం ప్రత్యేక వాహనం ఉంటే బాగుంటుందని భావించారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలెవరికీ లేని విధంగా సైనికులు వాడే వాహనాన్ని పోలిన బస్సును సిద్ధం చేయించారు. వీఐపీలు వాడే కేరవాన్ని తన టేస్ట్కు తగ్గట్టుగా అత్యాధునిక సదుపాయాలతో మలచుకున్నారు పవన్ . దానిపైనా వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూసింది. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా వారాహి ఉందని అడ్డుపడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం క్లీన్ చీట్ ఇవ్వడంతో నాటి జగన్ సర్కార్ సైలెంట్ అయ్యింది.
ఆ వాహనానికి 'వారాహి' అని నామకరణం చేశారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. లలితా దేవికి సైన్యాధ్యక్షురాలిగా ఆమెను శాస్త్రాలు పేర్కొంటాయి. యుద్ధంలో నలుదిక్కుల నుంచి కాపాడే వారాహీ అమ్మవారి పేరును తన వాహనానికి పెట్టుకున్న పవన్ కళ్యాణ్ .. ఆమె ఆశీస్సులతో ఎన్నికల రంగంలోకి దూకారు.
తెలంగాణలోని తనకు ఎంతో ఇష్టమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని ఆమె ఆశీర్వాదాలు కూడా అందుకున్నారు జనసేనాని. అంతేకాదు.. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో చివరి మూడు రోజులు కఠినమైన ఉపవాస దీక్ష చేశారు. తన కృషి, పట్టుదలతో పాటు భగవంతుడి ఆశీస్సులతో ఎన్నికల రణక్షేత్రంలో విజయం సాధించారు.

తాజాగా వారాహి నవరాత్రులు మొదలవ్వడంతో మరోసారి అమ్మవారి దీక్ష స్వీకరించనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష చేస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని పేర్కొంది. దీక్షకు అనుగుణంగా సాంప్రదాయ వస్త్రాలను ధరించి రోజువారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవన్ దీక్షా వస్త్రాలతోనే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ పాలనలోనూ సక్సెస్ కావాలని జనసేన కేడర్, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











