పవన్ కళ్యాణ్కు అత్యంత భారీ భద్రత.. ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గన్నవరంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్లు ప్రమాణం చేశారు. వారితో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు కూడా ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్పై అందరి దృష్టి నెలకొంది. ప్రమాణ స్వీకారం తర్వాత హైదరాబాద్ వెళ్లిన జనసేనాని అక్కడ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక మరోసారి చిరంజీవి - సురేఖలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేనానికి ఆయన వదిన సురేఖ ఖరీదైన పెన్నును బహుమతిగా అందజేశారు. ఖరీదైన ఈ పెన్నును ఆమె పవన్ జేబులో అప్యాయంగా పెట్టారు. ఆ పెన్నుతో పాటు తాను తొలుత సంతకం పెట్టిన రూ.10 పెన్నును కూడా తన జేబులో ఉంచుకోవడం విశేషం.

చంద్రబాబు నాయుడు కేబినెట్లో డిప్యూటీ సీఎం పోస్ట్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను జనసేనాని పొందారు. ఇప్పటి వరకు విపక్షనేతగా పోరాడిన పవన్.. ఇకపై పాలకుడిగా తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నారు. అటు ఉప ముఖ్యమంత్రి కోసం ఏపీ సచివాలయంలో ఛాంబర్ సిద్ధం చేశారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేషీకి దగ్గరలోనే పవన్ ఛాంబర్ను కేటాయించినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సెకండ్ బ్లాక్లోని మొదటి అంతస్తులో ఉన్న 212 నెంబర్ గదిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. జనసేన నుంచి మంత్రులుగా స్థానం దక్కించుకున్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ల ఛాంబర్లు కూడా ఆ బ్లాకులోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బుధవారం పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సెక్రటెరియేట్కు వెళ్తారు పవన్ . దీంతో ఆయనకు సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు ఘనస్వాగతం పలికేందుకు రాజధాని గ్రామాల రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం రెండో బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్ను పవన్ పరిశీలించి, ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.

ఇదిలావుండగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు 'వై ప్లస్' సెక్యూరిటీ.. ఎస్కార్ట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే డిప్యూటీ సీఎంకు క్యాంప్ కార్యాలయంగా విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ శాఖ గెస్ట్ హౌస్ను కేటాయించింది. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, బొత్స సత్యనారాయణలు ఈ భవనాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు ఈ గెస్ట్ హౌసే పవన్ కళ్యాణ్కు సైతం తన కార్యక్షేత్రంగా మారనుంది.


Click it and Unblock the Notifications











