Posani Krishna Murali : పవన్ , బాలయ్యలపై వ్యాఖ్యలు.. పోసాని చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!
నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి మనసులో ఏమున్నా సరే నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఎవరినైనా సరే దుమ్మదులిపేయడం ఆయన స్టైల్. ఈ విషయంలో ఎన్ని విమర్శలొచ్చినా, వివాదాలు చోటు చేసుకున్నా సరే ఆయన వెనక్కి తగ్గరు. ముఖ్యంగా వైఎస్ జగన్ అధికారంలో ఉండగా నాటి టీడీపీ పెద్దలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై విరుచుకుపడేవారు. అవే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఈ వివరాల్లోకి వెళితే..
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సినీ రంగం నుంచి మద్ధతు తక్కువే . ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు సంఘీభావం తెలిపినవారు కూడా తక్కువే. అయితే అలీ, పోసాని కృష్ణమురళి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, యాంకర్ శ్యామల వంటి వారు జగన్కు గట్టి మద్ధతుదారులుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం జగన్ వెంట ఉన్నది పోసాని, శ్యామల మాత్రమే. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా .. పోసానిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా నియమించారు జగన్.

తమ అధినేతపై ఈగ వాలనివ్వని పోసాని కృష్ణమురళీ.. వెంటనే ప్రెస్మీట్ పెట్టి వాళ్లను ఉతికి ఆరేసేవారు. చంద్రబాబు, పవన్ , నారా లోకేష్ సహా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిన పోసాని కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక .. గతంలో తమ నేతలను , కార్యకర్తలను వేధించిన ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరినీ అరెస్ట్ చేస్తున్నారు.
అయితే ఇటీవల మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు . ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ తన అరెస్ట్ గురించి వార్తలు ప్రసారం చేయడంపై ఆయన భగ్గుమన్నారు. తాను ఉన్నత చదువులు చదువుకొన్నానని.. తనకు డబ్బుపై ఆశ ఉంటే రాజకీయాల్లోకి నేను ఎందుకు వెళ్తానని పోసాని ప్రశ్నించారు. సినిమాల్లో అవకాశాలు రావడం లేదని తాను బాధపడటం లేదని తేల్చి చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆయన కోరిక మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేశానని.. పవన్ కల్యాణ్ స్వయంగా అడిగితే ఆయనపై గౌరవంతో పోటీ చేశానని తెలిపారు.

అమ్మాయిని ముద్దైనా పెట్టుకోవాలి.. లేదా కడుపైనా చేయాలి అంటూ బాలకృష్ణ కామెంట్ చేశాడు. అలాగే ఇద్దరిపై కాల్చులు జరిపారు.. వారు చావుకు దగ్గరయ్యారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారా? అని పోసాని ప్రశ్నించారు. నాకు నంది అవార్డు వస్తే.. ఇవి నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు అని నా అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చాను కుక్కా అంటూ టీటీడీ చైర్మన్ను పోసాని దూషించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి..
తాజాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పోసాని వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఐడీని వంశీకృష్ణ కోరారు. ఈ నేపథ్యంలో పోసాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.


Click it and Unblock the Notifications











