Pawan Kalyan: అపోలోలో పవన్ కళ్యాణ్.. బెడ్పై ఆ స్థితిలో, ఆందోళనలో అభిమానులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలు, ఇతర కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. వరుస రివ్యూలు, పర్యటనలు చేస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే తన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్లో పవన్ కళ్యాణ్ భాగమయ్యారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జనసేనాని. పాలన, రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నప్పటికీ గతంలో తాను కమిటైన సినిమాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి నిర్మాతలను ఒడ్డున పడేయ్యాలని భావిస్తున్నారు. తొలుత హరిహర వీరమల్లును పూర్తి చేసే పనిలో పవర్స్టార్ బిజీగా ఉన్నారు. కాస్త విరామం దొరికినా చాలు షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆయన వెంట కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆ తర్వాత ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్తో కలిసి పుణ్య స్నానం ఆచరించారు.
కాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా పలుమార్లు ఆయన అనారోగ్యం బారినపడ్డారు. మరీ ముఖ్యంగా వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలను ఆయనకు నిర్వహించారు.
రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారని .. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలను పవన్ కళ్యాణ్ చేయించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం హాజరవుతారని జనసేన పార్టీ తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఆయన ఆరోగ్యం విషయమై ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











