శెభాష్ తమ్ముడు.. పవన్ కళ్యాణ్ మనసు గెలిచిన కుర్రాడు.. యువకుడికి ఊహించని గిఫ్ట్
యువతరాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయొచ్చని నమ్ముతారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జనసేన మూల సిద్ధాంతాల్లో యువతకు అన్ని రకాలుగా ప్రోత్సహించడం కూడా ఒకటి. భావితరాల భవిష్యత్తుకు అద్భుతమైన బాటలు భవిస్తే తరాలు బాగుంటాయని పవన్ తన ప్రసంగాల్లో తరచుగా చెబుతుంటారు. చెప్పడమే కాదు ఆచరణలో పెట్టే అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్. తాజాగా ఓ ప్రతిభావంతుడి ప్రతిభను గుర్తించి అతనికి అండగా నిలిచారు. ఈ వివరాల్లోకి వెళితే..

మట్టిలో మాణిక్యాలు
మనదేశంలో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. సరిగ్గా ప్రోత్సహించి ఉపయోగించుకుంటే వారు భారతదేశ గతిని మార్చగలరు. స్కూల్, కాలేజీలలో కొందరు యువతీ యువకులు అధునాతన పరికరాలను కనిపెడుతుంటారు. అయితే మన వ్యవస్ధలో పేరుకుపోయిన అవినీతి రక్కసి ప్రతిభావంతులకు ప్రతిభకు ఆటంకం కలిగిస్తోంది. పేదరికం ప్రతిభకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తోన్న ధీరులు.. చదువులో, సాంకేతికతలోనూ రాణిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం అండ
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ బైక్స్, ఈ కార్స్, ఈ సైకిల్స్ ఈమధ్య బాగా పాపులర్ అవుతున్నాయి. వీటిని తయారు చేసేవారికి, కొనుగోలు చేసేవారికి కూడా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వణికిపోతోన్న సామాన్యులు.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే వీటి ధరలు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. తక్కువ ఖర్చులో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందించాలని ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది.
ఇంటర్ విద్యార్ధి ప్రతిభ
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలసకు చెందిన ఇంటర్ విద్యార్ధి రాజాపు సిద్ధూ అరుదైన ఆవిష్కరణ చేశాడు. తన ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేందుకు గాను అందుబాటులోని వస్తువులతో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వస్తువు తయారు చేశాడు. మొబైల్ ఛార్జర్ మాదిరి ఇంట్లోనే 3 గంటల పాటు ఛార్జింగ్ పెడితే.. ఏకంగా 80 కిలోమీటర్ల దూరం వెళ్లేలా సైకిల్ రూపొందించాడు. ఇంధన ఖర్చు ఆదా, ఎలాంటి శబ్ధ వాయు కాలుష్యం లేదు. అతని సైకిల్, ప్రతిభకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీలు, వాహనాల తయారీ కంపెనీలు సైతం సిద్ధూ ప్రతిభను ప్రశంసించాయి.
సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్
ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. స్వయంగా సిద్ధూని మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా తాను తయారు చేసిన బ్యాటరీ సైకిల్ను పవన్ కళ్యాణ్కు చూపించాడు సిద్దూ. దానిని చూసి ముచ్చటపడ్డ పవన్ .. ఆ కుర్రాడిని సైకిల్పై ఎక్కించుకుని తొక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ విడుదల చేసింది. ఇది సైకిల్ కాదని.. యువ ఆవిష్కర్త కల అని సిద్ధూని పవన్ ప్రశంసించారు. ఆ కుర్రాడికి లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించారు. విద్యార్ధులలోని సాంకేతికతను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువ విద్యార్ధి ప్రతిభను, పవన్ పెద్ద మనసును పలువురు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











