రప్పా రప్పా నరుకుతాం.. అల్లు అర్జున్ డైలాగ్పై జగన్కు పవన్ మాస్ వార్నింగ్
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో చెప్పిన రప్పా.. రప్పా డైలాగ్ థియేటర్లలో మోత మోగించింది. మొన్న ఉత్తమ నటుడిగా గద్ధర్ అవార్డ్ తీసుకుంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు కూడా ఈ డైలాగ్ చెప్పి ఫ్యాన్స్తో ఈలలు వేయించాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రప్పా.. రప్పా డైలాగ్ వివాదస్పదం, రాజకీయం, మాటల యుద్ధానికి కారణమైంది. టీడీపీ - వైసీపీ మధ్య తారాస్థాయికి చేరిన ఈ వివాదంలోకి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగారు. ఈ వివరాల్లోకి వెళితే..
పల్నాడులో ఉద్రిక్త పరిస్ధితులు
పల్నాడు జిల్లా రెంటళ్లపాడులో ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆయన పర్యటనపై పల్నాడు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించడం అయినప్పటికీ జగన్, వైసీపీ శ్రేణులు వాటిని లెక్కచేయకుండా తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వరకు ర్యాలీగా వెళ్లారు. జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్లోని ఓ వాహనం ఢీకొని వృద్ధుడు మరణించడం మరో వివాదానికి కారణమైంది.

జగన్ పర్యటనలో రెచ్చగొట్టే ఫ్లెక్సీలు
సుదీర్ఘ ప్రయాణం తర్వాత జగన్ సత్తెనపల్లె నియోజకవర్గంలోని రెంటళ్లపాడుకు చేరుకోగా.. ఆయనకు స్వాగతం పలుకుతూ వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిలించాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2లోని డైలాగ్ను అనుకరించేలా.. 2029లో వైఎస్సార్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అని రాసున్న ఫ్లకార్డ్ను ఓ వైసీపీ అభిమాని ప్రదర్శించాడు. ఇదొక్కటే కాదు ఎవడైనా రానీ తొక్కిపడేస్తాం, వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు, అన్న వస్తాడు.. అంతు చూస్తాడు వంటి రెచ్చగొట్టే డైలాగ్స్తో ఉన్న ఫ్లకార్డులను వైసీపీ కేడర్ ప్రదర్శించింది.
ఫ్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి అరెస్ట్
అన్నింటిలోకి రప్పా.. రప్పా ఫ్లకార్డ్ మాత్రం హాట్ టాపిక్గా మారింది. దీనిపై తెలుగుదేశంతో పాటు కూటమి నేతల నుంచి కౌంటర్ మొదలవ్వడం, దానికి వైసీపీ ఎదురుదాడి.. సోషల్ మీడియాలో రచ్చ చకాచకా జరిగిపోయాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫ్లకార్డ్ పట్టుకున్న రవితేజ అనే వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. ఈ డైలాగ్ చుట్టూ జరుగుతున్న వివాదాన్ని చల్లార్చాల్సిన వేళ జగన్ దీనికి మరింత ఆజ్యం పోశారు.
రప్పా రప్పా డైలాగ్ చెప్పిన జగన్
జూన్ 19న తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వయంగా రప్పా.. రప్పా అనే డైలాగ్ చెబుతూ అల్లు అర్జున్ మాదిరిగా గడ్డం కింద చేతులు పెడుతూ నవ్వించారు. సినిమా డైలాగ్ కూడా పెట్టుకోకూడదా మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా అంటూ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆ ఫ్లెక్సీని పట్టుకున్నది టీడీపీ వాళ్లేనని తెలిసిందని.. అంటే తెలుగుదేశం కేడర్ కూడా వైసీపీలో చేరి ప్రభుత్వంపై ఈ రకంగా నిరసన తెలియజేస్తున్నారా? అని ఫైర్ అయ్యారు. ఆ వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలను చంపమంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైలాగులు థియేటర్ వరకేనన్న పవన్
తాజాగా ఈ వ్యవహారంపై సినీనటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సినిమాలలో చెప్పే డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయని.. వాటిని నిజ జీవితంలో ఆచరిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అదుపు చేస్తామని.. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిని సమర్ధించేలా మాట్లాడేవారిని ప్రజలు గమనించాలన్నారు. సంఘ విద్రోహ శక్తులకు మద్ధతుగా మాట్లాడటం కూడా నేరమేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతుండగా.. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











