రాష్ట్రం జాగ్రత్త.. పవన్ అన్నా.. అభిమాని కేక వైరల్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. పవన్ అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదు, జగన్ 11 స్థానాలకు పరిమితమయ్యేవారు కాదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేరన్న వారికి తన విజయంతోనే సమాధానమిచ్చారు జనసేనాని. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో పాటు తాను నిలబెట్టిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని భారతదేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నారు పవన్ కళ్యాణ్. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ మూడోసారి అధికారాన్ని అందుకోవడంలోనూ పవర్స్టార్ది కింగ్మేకర్ పాత్ర. ఆయన సత్తాను గుర్తించారు కాబట్టే.. మోడీ అంతటి వ్యక్తి పవన్ను తుఫాన్ అంటూ ఆకాశానికెత్తేశారు. ప్రస్తుతం ఇంటా బయటా, మీడియాలో , సోషల్ మీడియాలో .. ఎవరి నోట విన్నా, ఎక్కడ చూసినా పవన్ నామస్మరణే .
తన ఆశయ సాధన కోసం , తాను కలలుగన్న పాలన అందించడం కోసం ఈసారి ప్రభుత్వంలోనూ భాగస్వామి కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు కేబినెట్లో డిప్యూటీ సీఎం పోస్ట్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను జనసేనాని పొందారు. బుధవారం ఉపముఖ్యమంత్రిగా సచివాలయంలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వంలో బాధ్యతలు దక్కడమే కాదు , పాలనాపరంగానూ ఆయనకు అత్యున్నత గౌరవం దక్కుతోంది.

తనకు ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కుతాయో అదే స్థాయిలో పవన్కు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటోను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన ఫోటో వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు ఫోటో పక్కనే పవన్ చిత్రపటాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పవన్కు భద్రతను సైతం పెంచింది ప్రభుత్వం. వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారును ఆయనకు కేటాయించింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు గాను పవన్ కళ్యాణ్ మంగళవారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

గన్నవరం విమానాశ్రయం గేటు బయట ప్రజలకు అభివాదం చేస్తుండగా వారిలో ఒక వ్యక్తి ''అన్నా రాష్ట్రం జాగ్రత్త '' అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో పవన్, జనసేన నేతలు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఆ వ్యక్తి వైపు టర్న్ అయ్యారు. పవన్ కల్యాణ్ స్వయంగా అభిమాని వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో పవన్ కల్యాణ్ జై అంటూ నినాదాలు మిన్నంటాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బట్టి పవన్ పాలనపై అభిమానులు , ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారోనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఎప్పుడూ తన ఎదుటి వ్యక్తి బాగుండాలని తపన పడుతుంటారు పవన్ కళ్యాణ్. ఈ లక్షణం, ఉన్నత వ్యక్తిత్వమే ఆయనను మిగిలిన హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ లక్షణాలే పవన్ను రాజకీయాల వైపు నడిపించి , ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకొచ్చాయి. జగన్ వంటి నియంత పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు .. చంద్రబాబు, పవన్లను నమ్మి రాష్ట్రాన్ని నడిపే బాధ్యతను వారి భుజస్కంధాలపై పెట్టారు. అందుకే పవన్ను చూడగానే సదరు అభిమాని రాష్ట్రం జాగ్రత్త అనే మాటలు అన్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు, అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని జనసేనాని నిలబెట్టుకుంటారని ఆకాంక్షిద్దాం.


Click it and Unblock the Notifications











