పవన్ కళ్యాణ్ సంకల్పం.. ప్రభుత్వ పాఠశాలకి దిగొచ్చిన 5 స్టార్ రేంజ్ కిచెన్
పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి రాకముందు నుంచే పాలన, సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న దానిపై ఆయనకు స్పష్టమైన లక్ష్యం ఉంది. ఇప్పుడు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎంగా తన ఆలోచనలను అమల్లోకి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంస్కరణలు చూసి పాలనలో ఎంతో అనుభవం ఉన్న అధికారులే ఆశ్చర్యపోతున్నారు. అలాగే అధికారులు ఎలాంటి సూచనలు చేసినా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా పవన్ సంకల్పంతో ఓ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. ఈ వివరాల్లోకి వెళితే..
కూటమి పాలనలో విద్యారంగంలో మార్పులు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పిల్లలు యూనిఫాం, బ్యాగ్లు, సిలబస్, వివిధ పథకాలను సమూలంగా మార్పులు చేశారు. దీనిలో భాగంగానే కార్పోరేట్ స్కూల్స్ మాదిరిగా మెగా పేరెంట్ - టీచర్ సమావేశాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి, సూచనలు చేయడానికి ఇందులో అవకాశం కల్పిస్తున్నారు.

మెగా పేరెంట్- టీచర్ మీటింగ్
ఈ సమావేశాలలోనే ఆటల పోటీలు, భోజనాలు, మొక్కలు నాటడం వంటి వినూత్న కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. తల్లికి వందనం పథకం, మనబడి మ్యాగజైన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన వంటి వాటిని కూడా వివరిస్తారు. జూలై 10న మెగా పేరెంట్- టీచర్ మీటింగ్ 2.0ను శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పిల్లలకు చంద్రబాబు క్లాస్
తరగతి గదుల్లోకి వెళ్లిన నేతలు విద్యార్ధులకు నేరుగా పాఠాలు చెప్పారు. విద్యుత్, భవిష్యత్ ఆలోచనలు, నీరు వంటి వాటిపై చంద్రబాబు క్లాస్ చెప్పారు. భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నారు? అని ముఖ్యమంత్రి అడగటంతో పిల్లలు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 2 కోట్ల మంది భాగస్వామ్యంతో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినట్లుగా అంచనా. దాదాపు 75 లక్షల మంది విద్యార్ధులు.. 3 లక్షలకు పైగా టీచర్లు, కోటి 50 లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ మీటింగ్ సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పవన్ సంకల్పంతో స్మార్ట్ కిచెన్
కాగా.. గతేడాది మెగా పేరెంట్- టీచర్ సమావేశంలో భాగంగా కడప నగరంలోని ఉన్నత పాఠశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పిన స్మార్ట్ కిచెన్ ఆలోచన పవన్ను ఆకట్టుకుంది. వెంటనే దీనికి ఏమేం కావాలో అడగటంతో పాటు వ్యక్తిగత నిధుల నుంచి ఆర్ధిక సాయం అందజేశారు ఉప ముఖ్యమంత్రి. ఆయన చొరవకు కలెక్టర్ కృషి కూడా తోడు కావడంతో కడప మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి అనుగుణంగా స్మార్ట్ కిచెన్ ప్రారంభమైంది. ఫైవ్ స్టార్ సదుపాయాలతో, ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించే తొలి స్మార్ట్ కిచెన్గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఈ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2200 మంది బడి పిల్లలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు.
స్మార్ట్ కిచెన్ స్పెషాలిటీ
ఇక్కడి కార్మికులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఈ స్మార్ట్ కిచెన్లో ఆటోమేషన్ ద్వారా భోజనం తయారీ జరుగుతుంది. అలాగే కుక్కర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రో ఒవెన్లు, ఫుడ్ సప్లయ్ చేసే వాహనాల ట్రాకింగ్ను స్మార్ట్ఫోన్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. ఈ కిచెన్ నుంచి మరిన్ని పాఠశాలలకు భోజనాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ స్మార్ట్ కిచెన్ పూర్తయిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారి ఆలోచనకు వ్యక్తిగతంగా ఆర్ధిక సహకారం అందించానని తెలిపారు. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ రుచికరమైన ఆహారాన్ని తయారు చేసే కుక్స్ ఇక్కడ ఉన్నారని పవన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో.. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొస్తున్న మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. కడపలో స్మార్ట్ కిచెన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్కు అభినందనలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











