నాగబాబుకు కీలక పదవి.. చంద్రబాబును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటిపోయింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్పై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. పరిపాలనా యంత్రాంగం కుదురుకోవడంతో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సహా బీజేపీ పెద్దలు నామినేటెడ్ పోస్ట్ల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. మూడు పార్టీల్లోనూ ఈ పోస్టుల కోసం పోటీపడుతున్న ఆశావహుల లిస్ట్ భారీగా ఉంది. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారు, టికెట్లు దక్కని వారు, వలస నేతలు తదితరులకు న్యాయం చేస్తామని అధినేతలు హామీ ఇచ్చారు.
కేబినెట్ విస్తరణ ముగిసి అంతా సద్దుమణిగిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తొలుత రాష్ట్ర స్థాయి పదవులను భర్తీ చేయాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను తెలియజేయాలని ఆయా శాఖల అధిపతులను సాధారణ పరిపాలనా శాఖ ఇటీవల ఆదేశించింది. దీనితో పాటు సొసైటీలు, కార్పోరేషన్లు, ప్రత్యేక సంస్థల్లోనూ ఉన్న ఖాళీల వివరాలు పేర్కొన్నాలని సూచించింది. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 95 కార్పోరేషన్ ఛైర్మన్ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇందులో 25 వరకు పోస్టులను జనసేన కోరుతోందట.

తొలి నుంచి తనకు అండగా నిలిచి, కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న తన సోదరుడు నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఏ రకంగా న్యాయం చేస్తారోనని జనసైనికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయాల్సింది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఆ సీటు కావాలని పట్టుబట్టడంతో పవన్ ఆ సెగ్మెంట్ను వదులుకున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది కానీ అది కూడా ఉత్త మాటేనని తేలింది. అనంతరం ఎమ్మెల్సీల భర్తీ సమయంలోనూ నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంటే ఉండి, రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తున్న హరిప్రసాద్కు అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్.
ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ రేసులో నాగబాబు పేరు వినిపిస్తోంది. ఇవాళ జనసేన కార్యాలయంలో నామినేటెట్ పోస్టుల భర్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం శ్రమించిన వారిని మరిచిపోమని.. హరిప్రసాద్ లాగే అందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవి కావాలని అడుగుతున్నారని.. ఒక్క టీటీటీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారని , ఒక్క పదవిని ఎంత మందికని ఇస్తారని పవన్ ప్రశ్నించారు.

ఇదే సమయంలో నాగబాబు పదవి విషయంలోనూ ఆయన క్లారిటీ ఇచ్చారు. తన కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి కోరలేదని , అయినా వారు అడిగినట్లుగా ప్రచారం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదవుల కోసం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అందరికీ న్యాయం చేయమని కోరతానని.. మోడీ కూడా కేంద్రంలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని అడగాల్సిన టైంలో అడుగుతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తద్వారా నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ గిరి గ్యారెంటీ అంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి పవన్ తెరదించారు. మరి నాగబాబును జనసేనాని ఎలా గౌరవించుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











