Union Budget 2024: ఫలించిన పవన్ కల్యాణ్ దూరదృష్టి.. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట!
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధించడం వెనుక పవన్ కళ్యాణ్ కష్టం ఎంతో ఉంది. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది నిజం. పవన్ కళ్యాణ్ లేకుంటే అసలు కూటమి సెట్ అయ్యేదే కాదన్నది బహిరంగ రహస్యం. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీతో జనసేన కలిసి నడుస్తుందంటూ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల వరకు పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
50 నుంచి 60 స్థానాలు ఇవ్వకుంటే పొత్తు వద్దని కుల పెద్దలు హెచ్చరించినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. జనసేన- టీడీపీలకు బీజేపీ అండ కావాలనే ఉద్దేశంతో కూటమిలోకి ఆ పార్టీని ఎలాగైనా తీసుకురావాలని కంకణం కట్టుకున్న పవన్ .. తనకు కేటాయించిన సీట్లను సైతం వదలుకుని త్యాగశీలి అనిపించుకున్నారు. ఆపై కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు.

తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. పవన్ అనే వ్యక్తి లేకుంటే వార్ వన్ సైడ్ అయ్యేది కాదని, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయేవారు కాదన్నది అందరూ అంగీకరించే విషయం. తాను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ . ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంలో పవన్ కీలకపాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో జనసేనానిపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పవన్ను ''తుఫాన్'' అని వ్యాఖ్యానించారంటే జనసేనాని సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మోడీ, చంద్రబాబుల వద్ద పవన్ మాటకు ఎదురులేదు. తన పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాల కోసమే వాడతానని పవన్ ఎన్నోసార్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక .. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునాదుల నుంచి గాడిలో పెట్టాలని ఆయన భావిస్తున్నారు. విభజన హామీలపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్.. ఏపీకి బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ రావాల్సిన విషయమై జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేయించారు.

ఇవాళ పార్లమెంట్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి చేసిన కేటాయింపులపై కీలక ప్రకటనలు చేశారు. రాజధాని అమరావతి కోసం రూ.15,000 కోట్ల నిధులు, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరాన్ని పూర్తిగా కేంద్రం ఖర్చుతో నిర్మిస్తామని ఆమె ప్రకటించారు. విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రాయలసీమ మీదుగా హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు మంజూరు చేయడంతో పాటు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.
ఈ కేటాయింపులన్నీ పవన్ కళ్యాణ్ దూరదృష్టి ఫలితమేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడటంలో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కీలకపాత్ర పోషించాయి. ఈ రెండు చోట్లా ఎన్డీయే కూటమి ఎక్కువ సీట్లు గెలవడంతో మోడీ పరువు నిలబడింది. బీహార్ సంగతి ఏమో కానీ ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉంటే తాము పొత్తులో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు పంతం పట్టారు. కానీ వారిని ఒప్పించి కూటమిలోకి బీజేపీ రావడానికి పవన్ కీ రోల్ పోషించారు. ఆయన మాటను పట్టించుకోకపోయుంటే ఏం జరిగేదో ఫలితాల తర్వాత బీజేపీ పెద్దలకు బాగా అర్ధమైంది. అందుకే ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన బీహార్, ఆంధ్రప్రదేశ్లపై మోడీ బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. ఇదంతా పవన్ వల్లేనని జనసేన కేడర్, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











