తారకరత్న భార్య జన్మదిన వేడుకల్లో వైఎస్ షర్మిల.. అలేఖ్య రెడ్డి కంటతడి!
నందమూరి తారకరత్న ఈ లోకాన్ని వీడి అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నమ్మకం కలగడం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అత్యాధునిక చికిత్సను అందజేశారు. కొన్నిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న 2023 ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే ఆయన కన్నుమూయడం నందమూరి అభిమానులను, టీడీపీ కార్యకర్తలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
అన్నింటిలోకి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, పిల్లలు దిక్కులేనివారు అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు వీరి బాధ్యతను తీసుకుని అలనా పాలనా చూస్తున్నారని ఫిలింనగర్ టాక్. అలేఖ్య మాత్రం భర్తతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోతున్నారు. సోషల్ మీడియాలో తారకరత్న ఫోటోలు, వీడియోలు, ఎమోషనల్ పోస్టులు పెడుతుంటారు. తారకరత్న చనిపోయినప్పుడు అలేఖ్య టీడీపీ తరపున పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఆమెను పార్టీలోకి చేర్చుకునేందుకు టీడీపీ, వైసీపీలు పోటీపడినట్లుగా వార్తలు వచ్చాయి.

తారకరత్న స్వయానా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవడు కాగా.. అలేఖ్యకు వైసీపీ నేతలతోనూ అంతే రిలేషన్ ఉంది. ఆ పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డి ఆమెకు పినతండ్రి. భర్త మరణంతో కృంగిపోయిన అలేఖ్యకు బాలయ్య, విజయసాయిరెడ్డి చేదోడు వాదోడుగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో 2024 ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్ధతు పలుకుతారోనని చర్చ మొదలైంది. అయితే ఆమె తన ఓటును టీడీపీకేనని స్పష్టం చేసింది. తన ఓటు కుటుంబానికేనని, బాలయ్య మామయ్యను .. నేను , పిల్లలు, ఓబు (తారకరత్న) ఎంతో ప్రేమిస్తున్నామని అలేఖ్య ఓ పోస్ట్లో రాసుకొచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 18న తారకరత్న తొలి వర్ధంతి కావడంతో అలేఖ్య ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను నిన్ను తాకలేను కానీ, నీ ఉనికి ఎల్లవేళలా మా చుట్టూనే ఉంటుంది. నీకు మరణం లేదు.. నువ్వే మా బలం, ఎప్పటికీ మాతోనే ఉంటావు అని రాసుకొచ్చింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు తారకరత్నకు నివాళులర్పించారు. తాజాగా అలేఖ్య రెడ్డి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమెతో ఓ ప్రముఖ వ్యక్తి దగ్గరుండి కేక్ కట్ చేయించారు. ఆ వ్యక్త ఎవరో కాదు.. స్వయానా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెల్లెలు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దీంతో అలేఖ్య ఎమోషనల్ అవ్వగా.. ఆమెను షర్మిల ఓదార్చారు.

తన బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అలేఖ్య.. గడిచిన కొన్నేళ్లుగా నా పక్కనే ఉంటానంటూ చేసిన ప్రామిస్ని నిలబెట్టుకున్నావ్ అక్క.. నా కోసం సమయాన్ని కేటాయించి, నా బర్త్ డేని సెలబ్రేట్ చేసినందుకు నీకు కృతజ్ఞతలు.. నువ్వు చేసే చిన్న పని కూడా ఆశీర్వాదం లాగానే అనిపిస్తుంది. నువ్వు నాకెంతో స్పెషల్.. నీ స్థానాన్నిఎవరూ భర్తీ చేయలేరు .. లవ్ యూ సో సో మచ్ షర్మిల అక్క అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











