పవన్ కళ్యాణ్పై విమర్శలు.. ఓడిపోయినోళ్లు మూస్కోవాలి.. ప్రకాశ్రాజ్కు బీజేపీ నేత స్ట్రాంగ్ రిప్లై
తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు ప్రకాశ్రాజ్. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపించే ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసేవారు. సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాశ్రాజ్ రాజకీయాలపై యాక్టీవ్ అయ్యారు. బీజేపీ విధానాలను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన ఆ పార్టీకి మద్ధతు ఇస్తున్న వారిపైనా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తన మిత్రుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

ఎంపీగా దారుణంగా ఓడిపోయిన ప్రకాష్ రాజ్
రాజకీయాలకు దగ్గరవుతూ వచ్చిన ప్రకాశ్.. ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా చేరతారని అంతా అనుకున్నారు. పైగా ఆ సమయంలో పలువురు సినీనటులు కొత్తగా పార్టీలు పెట్టడంతో ఆయన కూడా ఏదో ఒక పార్టీ పెడతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఏ పార్టీలోనూ చేరకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలో దిగిన ప్రకాశ్రాజ్ ఘోరంగా ఓడిపోయారు. కేవలం 28,906 ఓట్లు మాత్రమే ఆయన సాధించి ఓటమి చవి చూశారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన ప్రకాష్ రాజ్ సినిమాలలో బిజీ అయ్యారు.
బాలీవుడ్ అమ్ముడుపోయిందన్న ప్రకాష్ రాజ్
నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రకాష్ రాజ్ ఇటీవల బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. హిందీ ఇండస్ట్రీలో సగం మంది సెలబ్రెటీలు అమ్ముడుపోయారని.. మిలిగిన వారు సైలెంట్ అయ్యారని బాంబు పేల్చారు. దేశ రాజకీయాలపై సినీ పరిశ్రమకు చెందినవారు స్పందించడం లేదని.. వీరంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయారని ఆరోపించారు. నేరం చేసినా క్షమించొచ్చు కానీ.. వాస్తవాలు మాట్లాడకుండా మౌనం దాల్చిన వారిని చరిత్ర క్షమించదని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. నిజాలు మాట్లాడతాననే తనకు అవకాశాలు తగ్గాయని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్పై తరచూ విమర్శలు
కాగా.. తన మిత్రుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్ధతు ఇవ్వడాన్ని తొలి నుంచి విమర్శిస్తున్నారు ప్రకాష్రాజ్. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం మరోసారి పవన్పై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీతో పవన్ ప్రయాణం ముంబై లోకల్ ట్రైన్ జర్నీలాంటిదని .. సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోవడం ఏంటని ప్రకాష్ మండిపడ్డారు. పవన్కు ఏం తెలియదని, బీజేపీ వాళ్లే ఎక్కించారని.. వాళ్లే దించేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్ను వాడుకుని వాళ్లు పైకొస్తారని.. ఈ కొద్ది సమయం నువ్వు ఏంజాయ్ చేయమంటూ పవన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రకాష్రాజ్.
పవన్కు ఏం తెలియదంటూ వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, జనసేన కేడర్ భగ్గుమంటోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఘాటుగా స్పందించారు. బీజేపీపై నిత్యం విమర్శలు చేయడమే మీ పని.. పవన్ కళ్యాణ్పై విమర్శలతో వార్తల్లో నిలవడం తప్ప, నిజంగా మీరు ఏం సాధించారు అని ప్రకాశ్రాజ్ను నిలదీశారు విష్ణువర్థన్ రెడ్డి.
ప్రకాశ్రాజ్కు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా పోటీ చేశారు.. ఏం సాధించారని చురకలంటించారు. జనసేన పార్టీకి బీజేపీ అండగా ఉంటుందని, మీరు ప్రశాంతంగా ఉండాలంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఒకరకంగా ఓడిపోయిన వాళ్లు సైలెంట్గా ఉండాలి అన్న అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్ ఉందంటూ జనసేన కేడర్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











