అష్టదిగ్భంధనంలో సినీ నిర్మాత.. మాజీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పగ్గాలు అందుకున్న పవన్ కళ్యాణ్ పాలనలో దూకుడు చూపిస్తున్నారు. వరుసపెట్టి అధికారులతో రివ్యూలు, సమావేశాలు నిర్వహిస్తూ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి తగిన ఆదేశాలు ఇస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. గత ప్రభుత్వం తాలుకా అవినీతిని బయటపెట్టేందుకు, అక్రమార్కుల అంతు చూసేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన టెండర్ ప్రక్రియ, కాంట్రాక్ట్లు, బిల్లుల చెల్లింపు వంటిపై ఆయన ఆరా తీస్తున్నారు. తాజా మీడియాలో వైరల్ అవుతున్న మాజీ ఎంపీ,సినీ నిర్మాత వార్త వివరాల్లోకి వెళితే..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అవినీతిపై పవన్ కళ్యాణ్ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖనగరంపై పవన్ కళ్యాణ్ నాడు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అప్పట్లో మూడు రాజధానుల వ్యవహారం కారణంగా విశాఖలో భూముల ధరలు చుక్కలను తాకాయి. నగరంలో ఎక్కడికక్కడ భూకబ్జాలు, ఆక్రమణలు, అక్రమ వెంచర్లు వెలిసిన వ్యవహారాన్ని జనసేనాని ప్రస్తావించారు. తన వారాహి విజయయాత్రలో భాగంగా మంత్రులు, వైసీపీ నేతల కనుసన్నల్లో కబ్జాకు గురైన భూములు, కరిగిపోతున్న ఎర్రమట్టి దిబ్బలను ఆయన పరిశీలించారు.

అయితే విశాఖ ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గట్టి ఆరోపణలు చేశారు. సిరిపురం జంక్షన్లో ఎంవీవీ సంస్ధ చేపట్టిన అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ వివాదాస్పద వెంచర్ నుంచి ప్లాట్లను కొనుగోలు చేసి ఇబ్బందుల్లో పడొద్దని పవన్ ప్రజలను కోరారు. దీంతో తన పవన్పై ఎంవీవీ సత్యనారాయణ విరుచుకుపడగా.. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు చేసిన దోపిడీని, అన్యాక్రాంతమైన స్థలాలను బయటకు తీసుకొస్తామని పవన్ అప్పుడే హెచ్చరించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఎంవీవీ ఆయన అనుచరవర్గం బిక్కుబిక్కుమంటున్నారు.
ఇప్పటికే సిరిపురం జంక్షన్లో ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన అత్యాధునిక అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ జీవీఎంసీ ఆదేశాలిచ్చింది. నాడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఎంవీవీ అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఖాళీ సైట్లు కనిపించినా, వాటి మీద కన్నేయడం , కాజేయడం , వివాదాలు క్రియేట్ చేసి ఆ స్థలాలను సొంతం చేసుకుని బిల్డింగ్లు కట్టేయడాన్ని సత్యనారాయణ పరిపాటిగా మార్చుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక గతంలో చేసిన తప్పులు ఇప్పుడు ఎంవీవీ మెడకు చుట్టుకుంటున్నాయి. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం కేటాయించిన హయగ్రీవ భూములపై నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని సత్యనారాయణపై కేసు నమోదైంది. అలాగే ఎంపీగా ఉన్న సమయంలో ఎంవీవీ భార్యా, కుమారుడు, ఆడిటర్ జీవీల కిడ్నాప్ వెనుక ఉన్న అసలు గుట్టు ఛేదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కూటమి సర్కార్ తనను టార్గెట్ చేస్తుండటంతో పార్టీ మారేందుకు ఎంవీవీ సిద్ధమయ్యారన్న వార్తలు వస్తున్నాయి.

టీడీపీ, జనసేనల్లో తనకు బెర్త్ దొరకదని భావించి బీజేపీలో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఏపీలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం రావడంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర లేనిదే బీజేపీ పెద్దలు కూడా ఎంవీవీని పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల మద్ధతు లేకపోవడం రోజుకొక కేసు తనపై నమోదవుతూ ఉండటంతో ఎంవీవీ సత్యనారాయణ దిక్కుతోచని పరిస్ధితుల్లో పడిపోయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సదరు మాజీ ఎంపీ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్, మాజీ ఎంపీ మధ్య పొలిటికల్ వార్ స్థానికుల్లో ఆసక్తిని నింపుతున్నది.


Click it and Unblock the Notifications











