చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. పవన్ కల్యాణ్తో మోదీ తెర వెనుక మంత్రాంగం!
కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చని నిరూపించిన వారిలో చిరంజీవి ఒకరు. అతి సామాన్య స్థాయి నుంచి మెగాస్టార్గా ఎదిగి, టాలీవుడ్కు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరు. ఆయనను స్పూర్తిగా తీసుకుని సినీ పరిశ్రమలోకి ఎందరో హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఎంట్రీ ఇచ్చారు.. ఇంకా ఇస్తున్నారు. అంతలా తన వ్యక్తిత్వంతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు చిరంజీవి. తనను ఇంతటి వాడిగా చేసిన సొసైటీకి తన వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లను స్థాపించి వేలాది ప్రాణాలను నిలబెట్టారు.
తెలుగు నాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తర్వాత అంతటి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. పెద్దాయన బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2008లో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించి రాజకీయాల్లోకి దూకారు. రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో తలపడటం ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించిన చిరు.. తర్వాతి రోజుల్లో పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర కేబినెట్లో బెర్త్లతో పాటు తను రాజ్యసభకు ఎన్నికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఖైదీ నెంబర్ 150 ద్వారా తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ లక్షలాది మంది మెగాభిమానులు, కాపు సామాజిక వర్గంలో ఆయన పరపతి ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ, ఇప్పటికీ చిరంజీవిని వారు పెద్దన్నయ్యగా గౌరవిస్తూ.. ఆయన మాటను వేదవాక్కుగా భావించేవారు ఎందరో. అందుకే చిరంజీవి ఇప్పుడు వస్తానన్నా అనేక పార్టీలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

రాజకీయాలకు దూరం జరిగిన తర్వాత తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే దానిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. పదేళ్లుగా మౌనంగానే ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల్లో కూటమికి చిరంజీవి బాహాటంగా మద్ధతు పలకడం చర్చనీయాంశమైంది. సీఎం రమేశ్, పంచకర్ల రమేష్ బాబులను పక్కపక్కన కూర్చోబెట్టుకుని ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని, తెర వెనుక మంత్రాంగం నడుస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రాధాన్యత.. ప్రజలు, రాజకీయ వర్గాలకు ఎన్నో సంకేతాలు పంపాయి. ఈ పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టరని, అదే సమయంలో ఆయన ఊహించని ఓ పెద్ద పదవి మెగాస్టార్ను వరిస్తుందని జోస్యం చెప్పారు.
చిరంజీవి గౌరవానికి, ఇమేజ్కు తగిన విధంగా కేంద్రం నుంచి ఆ పదవి వస్తుందని రామారావు పేర్కొన్నారు. ఇందుకు ప్రధాని మోడీ కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ, రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చనే రామారావు బయటపెట్టారని లేదంటే ఈ వ్యాఖ్యలు చేయరు కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఢిల్లీలో మోడీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి. చంద్రబాబు, మోడీలకు ఇప్పుడు ఆయన ఎంత చెబితే అంత. రేపు చిరంజీవికి నిజంగానే పదవి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











