పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేయాలి.. మూడు పెళ్లిళ్లపై నోరు పారేసుకున్న సీపీఐ నారాయణ
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మూడు పెళ్లిళ్ల వ్యవహారం వెంటాడుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతినిత్యం వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ను ఇదే అంశంతో టార్గెట్ చేసేవారు. అసెంబ్లీతో పాటు ఏ వేదికపైకెక్కినా పవన్ను వ్యక్తిగతంగా విమర్శించేవారు. వైసీపీ నేతలను వారించాల్సిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం వారి బాటలోనే నడిచారు. మొదట్లో ఈ వ్యాఖ్యలను పట్టించుకోని పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలు హద్దులు దాటడంతో ఎదురుదాడికి దిగారు. జగన్ను సైతం నువ్వే నా నాలుగో పెళ్లాం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి.
ప్రజల కోసం కెరీర్ను వదలుకున్న పవన్
ప్రజల కోసం నెంబర్వన పొజిషన్ని, తన కెరీర్ని పక్కనపెట్టి రాజకీయాల్లోకి దిగారు పవర్స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి తొలుత కాస్తంత ఇబ్బంది పడినప్పటికీ రాను రాను పవన్ రాటుదేలారు. 2014లో టీడీపీ- బీజేపీకి మద్ధతు పలికిన పవన్ 2019 ఎన్నికలకు ముందు కూటమి నుంచి బయటికి వచ్చి వామపక్షాలు, బీఎస్పీ మద్ధతుతో పోటీ చేశారు. అయితే పోటీ చేసిన రెండు చోట్లా తాను ఓడిపోవడంతో పాటు కేవలం ఒకే ఒక్క స్థానంలో జనసేన గెలవడంతో పవన్ ప్రతిష్టపై దెబ్బపడింది.

వైఎస్ జగన్కు స్ట్రాంగ్ కౌంటర్
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆయన 2024 ఎన్నికల నాటికి పార్టీని అన్ని విధాలుగా సిద్ధం చేసి బీజేపీతో తొలుత పొత్తు కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్ తర్వాత టీడీపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం బీజేపీ పెద్దలను ఆయన ఒప్పించారు. వారాహి యాత్ర పేరుతో సుడిగాలి పర్యటనలు చేయడంతో పాటు ప్రజా సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలు, జనవాణి వంటి కార్యక్రమాలతో శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చారు. వైసీపీపై వాడి వేడి విమర్శలు చేస్తుండటంతో నాటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించి ఆయను ఇరుకున పెట్టాలని చూసేవారు. కొన్నాళ్లు సహించిన పవన్ .. ఏకంగా నాటి సీఎం వైఎస్ జగన్ కూడా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో నాలుగో పెళ్లాం నువ్వేనంటూ కౌంటరిచ్చారు.
సనాతన ధర్మ పునరుద్ధరణకు పవన్ కృషి
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు నీరుగారిపోయాయి. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. దేశంలో సనాతన ధర్మంపై దాడులు జరుగుతుండటంతో సనాతన ధర్మాన్ని రక్షించేందుకు దీక్ష చేపట్టారు. దీనిపైనా వైసీపీ విమర్శలు గుప్పించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ట్రోల్ చేసింది. తాజాగా ఈ లిస్ట్లోకి సీపీఐ నారాయణ చేరారు. మరోసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లను టార్గెట్ చేసిన పెద్దాయన ఏకంగా డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలన్న నారాయణ
ఈ మేరకు నారాయణ ఓ వీడియో రిలీజ్ చేశారు. సనాతన ధర్మాన్ని విమర్శించిన వారిని అరెస్ట్ చేయాలని, జైల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్నారని.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా అని నారాయణ ప్రశ్నించారు. అసలు సనాతన ధర్మంలో విడాకులు ఉండవని, సనాతనం గురించి మాట్లాడే ఏపీ ఉప ముఖ్యమంత్రి ముగ్గురు భార్యలను ఎందుకు మార్చారని నారాయణ నిలదీశారు. పవన్ చెబుతున్న దానిని బట్టి ముందుగా అరెస్ట్ చేయాల్సింది.. జైల్లో పెట్టాల్సింది పవన్ కళ్యాణ్నే అని దుయ్యబట్టారు. ప్రస్తుతం సీపీఐ నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











