వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సినిమా .. నిందితులు ఎవరో అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో నేటికీ కలకలం రేపుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పులివెందులలోని నివాసంలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై నాటి టీడీపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించగా.. అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
వివేకా హత్య వెనుక వైఎస్ కుటుంబంలోని కొందరి ప్రమేయం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ అవినాష్ రెడ్డిల పేర్లు వినిపించాయి. భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు సైతం పంపారు. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే వివేకా కేసులో నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. తండ్రి హత్యకు కారణమైన వారికి శిక్షపడాలని ఆమె అలుపెరగని పోరాటం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని గెలిపించవద్దని, కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని సునీత ప్రచారం చేశారు.

ఎన్నికల్లో సైతం వివేకా హత్యను కార్నర్ చేస్తూ జగన్పై విమర్శలు చేశారు ప్రతిపక్షనేతలు. ఇక వివేకా హత్యను ఇతివృత్తంగా తీసుకుని వివేకం పేరుతో సినిమా రూపుదిద్దుకుంది. థియేటర్లో కాకుండా యూట్యూబ్లో రిలీజైన ఈ సినిమా వ్యూయర్షిప్ పరంగా సంచలనం సృష్టించింది కూడా. ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ వివేకా కేసు గత ఎన్నికల్లోనూ ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి కడప పార్లమెంట్, ఉమ్మడి కడప జిల్లాల్లో వైసీపీకి వ్యతిరేక ఫలితాలు రావడానికి వివేకా హత్యే కారణమని చెబుతున్నారు.
ఇకపోతే.. గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్కు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ట్విట్టర్ పోస్టులు, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచారు ఆర్జీవీ. 2019 ఎన్నికల సమయంలో ఆయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ , అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు వైసీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయని పొలిటికల్ సర్కిల్స్లో వినిపించే మాట. 2024 ఎన్నికల సమయంలోనూ వైఎస్ జగన్ బయోపిక్ను వ్యూహం పేరిట తెరకెక్కించి రిలీజ్ చేశారు. అప్పుడు కూడా వర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు కూటమి నేతలు.
ఈ నేపథ్యంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, తదితర పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. వివేకా హత్యపై సినిమా తీస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. తనకు నచ్చిన అంశంపై సినిమా తీస్తానని చెప్పుకొచ్చారు. వివేకా మర్డర్ కేసు గురించి తనకు అవగాహన లేదని, దీనిని తాను ఫాలో అవ్వలేదన్నారు. కేసు మొత్తం పూర్తయ్యాక, నిందితులు ఎవరో తెలిశాక స్టడీ చేయటానికి అవకాశం ఉంటుందని, అప్పుడైనా సినిమా తీయొచ్చు, తీయకపోవచ్చునని వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











