ఈ విషయంలో పవన్ కల్యాణ్కు ఉన్న అవగాహన వైఎస్ జగన్కు లేదా? లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టడం మొదలు , ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది కీలకపాత్ర. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. ఆయన పడిన కష్టానికి చంద్రబాబు తగిన గుర్తింపునిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలను పవన్ చేతుల్లో పెట్టారు ముఖ్యమంత్రి.
ప్రమాణ స్వీకారం చేసిన తక్షణం పనిలో పడిపోయిన పవన్ కళ్యాణ్ వరుస రివ్యూలు చేస్తూ , కీలక ఆదేశాలు ఇస్తూ పాలకుడిగా తన మార్క్ చూపిస్తున్నారు. ఇదే సమయంలో తనను కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు, విగ్రహాలు తీసుకురావొద్దని వాటి స్థానంలో కూరగాయలో, పండ్లో తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తద్వారా వాటిని వృద్ధాశ్రమాలకు అందించవచ్చని.. లేనిపక్షంలో వాటిని కొనుగోలు చేయడానికి అవసరమయ్యే నగదును టోకెన్ రూపంలో అందిస్తే అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే భోజనం అందించడానికి వినియోగిస్తామన్నారు. తన సూచన మేరకు కూరగాయల బుట్టలతో వచ్చి కలిసిన ఎంపీలు బాలశౌరీ, ఉదయ్లను పవన్ అభినందించారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన పవన్ కళ్యాణ్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన సరిగా చేయలేదని.. ఆదాయ మార్గాలు , రాజధాని ఎక్కడో చెప్పకుండా ఏపీని గాలికొదిలేసిందని ఆయన పలు వేదికలపై ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో కష్టాల్లో పడ్డ ఏపీని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడైతేనే గాడిలో పెడతారని నమ్మి.. 2014 ఎన్నికల సమయంలో మద్ధతు పలికారు. తిరిగి జగన్ విధ్వంస పాలనతో అదే స్థాయిలో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్కు జవసత్వాలు నింపాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని విశ్వసించి మరోసారి టీడీపీతో జతకట్టారు.
ఏపీని పునర్నిర్మించే బాధ్యతలో తాను కూడా భాగమైన పవన్.. అధికారంలోకి రాగానే విభజన హామీలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఓ రోజున తనను కలిసేందుకు వచ్చిన బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరీతో .. విభజన చట్టంలో ఏపీకి ఒక ఆయిల్ రిఫైనరీ రావాల్సి ఉందన్న విషయం తెలుసా, నువ్వేమైనా స్టడీ చేశావా అని ప్రశ్నించారట. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా మనకు రిఫైనరీ రాలేదని, దీనిపై నువ్వు గట్టిగా కృషి చేయాలని పవన్ తనతో అన్నారని బాలశౌరీ చెప్పారు.

దీంతో పార్లమెంట్ సమావేశాలు జరగడానికి ముందే ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి రిఫైనరీ గురించి చర్చించానని ఆయన వెల్లడించారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా మోడీతో ఈ విషయం గురించి చెప్పడంతో రిఫైనరీకి సంబంధించిన ఫైల్ వేగంగా కదులుతోందని బాలశౌరీ చెప్పారు. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే ఈ రిఫైనరీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఖచ్చితంగా తనకు తెలియదని ఎంపీ అన్నారు. కానీ మచిలీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేస్తే వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని బాలశౌరీ తెలిపారు.
బాలశౌరీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు , అభిమానులు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనకు ఎంపీల బలాన్ని ఇస్తే ప్రత్యేక హోదా, విభజన సమస్యలు పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ గడిచిన ఐదేళ్లలో ఏనాడైనా వైసీపీ ఎంపీలకు ఇలా చెప్పారా అంటూ చురకలంటిస్తున్నారు. జగన్ దృష్టిపెట్టలేని అంశాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకుని.. రిఫైనరీని ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడుతున్నారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై పవన్కున్న అవగాహనను మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











