టాలీవుడ్ నిర్మాతకు ఈడీ షాక్.. 45 కోట్ల ఆస్తులు జప్తు
ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ అంటే ఎవరికీ గుర్తుకురాకపోవచ్చు. అదే ఎంవీవీ సత్యనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలకు ఇట్టే గుర్తొస్తారు. వైసీపీ అభ్యర్ధిగా 2019 లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఏకంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, గీతం అధినేత భరత్పై గెలుపొంది వార్తల్లో నిలిచారు. ఉత్తరాంధ్రలో రియల్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఎంవీవీ సత్యనారాయణ.. రాజకీయాల్లోనూ అడుగుపెట్టి సక్సెస్ కొట్టారు.
కొద్దిరోజుల క్రితం ఎంవీవీ కుమారుడు శరత్, భార్య జ్యోతి, ఆడిటర్ జీవీలను కిడ్నాప్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఎంవీవీ కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత విశాఖను వదిలి హైదరాబాద్కు తన మకాం మార్చాలని సత్యనారాయణ నిర్ణయించుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఎంవీవీ సైలెంట్ అయ్యారు.

ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన జరిగి ఏడాది పూర్తవుతోంది. అయినప్పటికీ ఇంకా సస్పెన్స్ మాత్రం వీడలేదు.. ఈ ఘటన ఎంవీవీ ప్రత్యర్ధుల పనేనా, లేక సొంత పార్టీ నేతలే ఆయనను ఇబ్బంది పెట్టారా అంటూ విశాఖ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలతో పాటు సినీ నిర్మాతగానూ ఎంవీవీ సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఎంవీవీ సినిమా బ్యానర్పై గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, లక్కున్నోడు, నీవెవరో, గల్లీ రౌడీ, గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలు నిర్మించారు.
ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు చేసిన దోపిడీ, అన్యాక్రాంతమైన స్థలాలను బయటకు తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ ఆనాడే హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ , పరిసర ప్రాంతాల్లో ఎంవీవీ సత్యనారాయణ బాగోతాలు బయటికొచ్చాయి. ఈ క్రమంలోనే ఎండాడ ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన హయగ్రీవ ప్రాజెక్ట్కు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసినట్లుగా తేలింది.

హయగ్రీవ ప్రాజెక్ట్ భూమిని మోసపూరితంగా లాక్కొన్నారని గతేడాది జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన సతీమణి రాధారాణిలు ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవీ, గద్దె బ్రహ్మాజీలు హయగ్రీవ ఫామ్స్ పేరిట ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లను అక్రమంగా ఆర్జించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలకు సంబంధించిన రూ.44.74 కోట్ల ఆస్తులను తాజాగా ఈడీ జప్తు చేసింది.


Click it and Unblock the Notifications











