వివాదంలో ఆర్కే రోజా .. సొంత కార్యకర్తలపై చేయి చేసుకుని, బూతులు తిడుతూ
ఆర్కే రోజా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన ఆమె రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా ముద్ర వేశారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన హవా చూపించిన రోజా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని విధంగా ఆమె వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
ఒకప్పుడు దక్షిణాదిలో తిరుగులేని హీరోయిన్గా వెలుగొందారు రోజా. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా తన కృషి, పట్టుదలతో అగ్రనటిగా ఎదిగారు. దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించిన ఆమె దాదాపు పదేళ్ల పాటు నిరీక్షించి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ కావడంతో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ ఏ పని చెప్పినా సమర్ధవంతంగా నిర్వహించి తెలుగు మహిళ అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2009లో టీడీపీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా.. తర్వాతి కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

ప్రత్యర్ధులపై వాడి వేడి విమర్శలు చేయడంలో ముందుండే రోజా.. వైసీపీలో మరింత రాటు దేలారు. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు రోజా. నాడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో అధినేత జగన్ ఆదేశాల మేరకు అధికార పక్షంపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా .. వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసీ ఛైర్పర్సన్గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు అవకాశం కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవ్వడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితం అయ్యారు.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ కంప్లీట్ కావడంతో రోజా యాక్టీవ్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలపై వాడి వేడి విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు రోజా. తాజాగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన ఆరుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రోజా పరామర్శించి ప్రభుత్వంపై మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనను ప్రభుత్వ హత్యలుగా ఆమె అభివర్ణించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని ఆమె మండిపడ్డారు. టీటీడీ పాలక వర్గం, హోంశాఖ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కార్యకర్తలపై చేయి చేసుకున్న మాజీ మంత్రి రోజా..తిడుతూ వెళ్లిన రోజా..#TDPTwitter #Andrapradesh pic.twitter.com/atAegTyD8O
— TDP Trends (@Trends4TDP) January 9, 2025
తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం లక్షలాది మంది వస్తారని తెలిసి సరైన ఏర్పాట్లు చేయలేదని రోజా మండిపడ్డారు. ఎఫ్ఐఆర్లో 194 బీఎన్ఎస్ కింద కేసు పెట్టి చేతులు దులిపేసుకున్నారని రోజా విమర్శించారు. ఇదే సమయంలో రోజా ఓ వివాదంలో చిక్కుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బాధితులను పరామర్శించి వస్తుండగా రోజాను వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టేశారు. దీంతో ఆమె బయటికి రావడం కష్టమైంది. ఓపిక నశించడంతో కార్యకర్తలపై చేయి చేసుకున్న రోజా అడ్డు తప్పుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు, వైసీపీ నేతలు కార్యకర్తలను పక్కకి లాగేసి రోజాను బయటికి తీసుకొచ్చారు. వస్తూ వస్తూ కార్యకర్తలను తిడుతున్న రోజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











