కమ్మ వాళ్ళే నీ సినిమాలు చూస్తారా? రామ్ పోతినేనిపై వల్లభనేని వంశీ నోటి దూల.. వాళ్ళే ఓడించి గుణపాఠం చెప్పారా?
సరిగ్గా మూడేళ్ల క్రితం ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కంటికి కనిపించని సూక్ష్మజీవి తన కంటే ఎన్నో రెట్లు బలవంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది. ఎదుటి వ్యక్తి తుమ్మినా, తగ్గినా అనుమానపు చూపులు.. కళ్లెదుటే తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, ఆత్మీయులను మహమ్మారి బలితీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్పించి ఏం చేయలేని పరిస్ధితి. ఇక కంపెనీలు, ఫ్యాక్టరీలు నెలల తరబడి మూతపడటంతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.
కోవిడ్ బారినపడిన వారికి ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సదుపాయాలు దొరకలేదు. ఇదే అదనుగా హాస్పిటల్స్ యజమాన్యాలు ధరలను భారీగా పెంచేశాయి. లక్షలు చెల్లిస్తామన్నా బెడ్స్ దొరకలేదు సరికదా.. చెట్ల దగ్గర, మెట్ల దగ్గర కూర్చొన్నవాళ్లు కూర్చున్నట్లే ప్రాణాలు విడిచారు. అంత్యక్రియల కోసం భారీ క్యూలు.. మృతదేహాలను కాల్చేందుకు స్థలం సరిపోక మైదానాలు, పార్కుల్లో సామూహికంగా ఖననం చేసిన పరిస్ధితులు. ఇలా ఒక్కటా రెండా కరోనా మిగిల్చిన విషాదాలెన్నో. ఈ క్రమంలోనే కొన్ని ఆసుపత్రులు ప్రైవేట్ హోటల్స్ ఇతర భవనాల్లో బెడ్లు ఏర్పాటు చేసి కరోనాకు చికిత్స అందించాయి.

ఈ క్రమంలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 10 మంది సజీవదహనం కాగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకం వల్లే ఈ ఘటన జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఇష్యూపై సినీనటుడు , యువ హీరో రామ్ పోతినేని స్పందించడం వివాదాస్పదమైంది. సదరు ఆసుపత్రి నిర్వాహకులు రామ్కు దగ్గరి బంధువులు కావడంతోనే ఆయన స్పందించారనే ఫిలింనగర్లో గుసగుసలు వినిపించాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి అప్పట్లో వరుస ట్వీట్స్ చేసిన రామ్.. సీఎం జగన్పై కుట్ర జరుగుతోందని, కొందరి పనుల వల్ల మీ రెప్యుటేషన్ దెబ్బతింటోందని కామెంట్ చేశారు. అలాగే కులం అనేది కరోనా కంటే ప్రమాదకరమైనదంటూ చేసిన ట్వీట్ దుమారం రేపింది.
దీంతో రామ్ పోతినేనిపై వైసీపీ నేతల నుంచి విమర్శల దాడి మొదలైంది. ముఖ్యంగా అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే రామ్పై విరుచుకుపడ్డారు. కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. తనకు ఉన్న సమస్యలన్నింటినీ ఆయన కులానికి రుద్దుతాడని వంశీ ఆరోపించారు. రామ్ పోతినేని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని.. ఆయన సినిమాలను ఒక్క కమ్మ సామాజికవర్గానికి చెందినవాళ్లే చూస్తారా అంటూ ప్రశ్నించారు. వేరే కులానికి చెందిన వారిని తన సినిమా చూడవద్దని రామ్ చెప్పగలరా అని వల్లభనేని వంశీ నిలదీశారు. అయితే ఆ తర్వాత రామ్ సైలెంట్ అయిపోవడంతో .. వివాదం సద్దుమణిగింది.

అయితే వల్లభనేని వంశీ వ్యాఖ్యలు కమ్మ సామాజిక వర్గం , రామ్ అభిమానుల మనసులను తీవ్రంగా గాయపరిచింది. ఎన్నికల సమయంలో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో అసభ్యకర వ్యాఖ్యలకు తోడు గతంలో రామ్ను అన్న మాటలు వంశీకి చేటు చేశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన వల్లభనేని వంశీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. పైగా హీరో రామ్ విజయవాడకు చెందిన వ్యక్తేనన్న సంగతి తెలిసిందే. గతాన్ని గుర్తుచేసుకున్న ఆ వర్గం వంశీకి వ్యతిరేకంగా ఓటేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపోతే.. రామ్ పోతినేని ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నారు. నిజానికి మార్చి 8న సమ్మర్ కానుకగా డబుల్ ఇస్మార్ట్ను రిలీజ్ చేయాలని అనుకున్నారు.. అయితే అది కాస్తా ఆగస్ట్ 15కి వాయిదా పడింది. ఆ రోజున తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ను గ్రాండ్గా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











