మనల్ని ఎవడ్రా ఆపేది.. తొడగొట్టి అసెంబ్లీలోకి పవన్ కల్యాణ్
సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 మే 23న లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తల గుండె చెరువైంది.. దిక్కులు పిక్కటిల్లేలా రోదనలు మిన్నంటాయి. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలు. మాటల తూటాలతో ప్రత్యర్ధులు విరుచుకుపడుతుంటే మౌనమే సమాధానమైంది. కారణం.. అభిమానుల ఆరాధ్య దైవం, పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్ష పార్టీల మద్ధతుతో బరిలో దిగారు పవన్ కళ్యాణ్. కాపు సామాజికవర్గం, తన అభిమానుల ప్రాబల్యం అధికంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాకలలో పోటీ చేశారు.
కూటమిలోంచి బయటకు రావడంతో పాటు వైఎస్ జగన్ గాలి బలంగా వీయడంతో జనసేన అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. కేవలం రాజోలు మాత్రం పరువు నిలిపింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ రావు విజయం సాధించారు. జనసేన ఓడిపోయినా పెద్దగా పట్టించుకోని అభిమానులకు పవన్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓటమి పాలయ్యారు. దీనిని జనసేన కేడర్, ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. చాలాకాలం పాటు జనసైనికులను ఇది వెంటాడింది.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చెక్కు చెదరలేదు. రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వానికి కొద్దిరోజులు సమయం ఇచ్చి వేచి చూద్దామన్నారు. కానీ తాను ఈ ఐదేళ్లు ఎలా వ్యవహరిస్తానో ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ విపక్షాలకు సంకేతాలు పంపారు. ఆ వెంటకే ఇసుక అమ్మకాలను కట్టడి చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. దీంతో ఉపాధి లేక పలువురు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిణామాలపై దిగ్భ్రాంతి చేసిన పవన్ .. భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాటం ప్రారంభించారు.
అప్పటి నుంచి కౌలు రైతులకు భరోసా యాత్ర, జనవాణి, వారాహీ విజయ యాత్రలతో నిత్యం జనంలో ఉండేలా చూసుకున్నారు. ఒకానొక దశలో పార్టీని నడపటానికి నిధులు లేకపోవడంతో సినిమాలు చేసి, ఆ డబ్బును వినియోగించారు. తన సొంత సొమ్మును పార్టీకి విరాళంగా ఇచ్చి.. జనసైనికులకు జీవిత భీమా, ఆర్ధిక సాయం అందించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తున్న ప్రజా స్పందనతో భయపడ్డ జగన్ సర్కార్ ఆయనకు పలుమార్లు అడ్డంకులు సృష్టించారు. మంత్రులు, ఇతర కీలక వైసీపీ నేతలు నిత్యం పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడంటూ ఆయన మానసిక స్థైర్యం దెబ్బతిసేందుకు యత్నించేవారు. చివరికి సీఎం జగన్ కూడా మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ను టార్గెట్ చేసేవారు.

చాలాకాలం పాటు విమర్శలను తేలిగ్గా తీసుకున్న పవన్ .. ఇక లాభం లేదనుకుని తన విశ్వరూపం చూపించారు. ఎవడైనా తనను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించారు. అస్తమానం మూడు పెళ్లిళ్లు అంటూ విమర్శిస్తున్న జగన్ను.. నా నాలుగో పెళ్లాం నువ్వేనంటూ పవన్ చురకలంటించారు. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ అసెంబ్లీలోనూ అడుగుపెడుతున్నామని తొడగొట్టి చెప్పారు జనసేనాని. జగన్ను అథ: పాతాళానికి తొక్కేస్తానని చెప్పిన పవన్ తన వ్యూహాలతో బీజేపీ, టీడీపీలతో జతకట్టి.. వాడి వేడి ప్రసంగాలతో ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించారు. తన సామాజిక వర్గం, అభిమానుల ఓట్లను కూటమి దిశగా మళ్లించి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారు.
ఈసారి రెండు స్థానాల నుంచి కాకుండా పిఠాపురం నుంచి బరిలో నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డిప్యూటీ సీఎంగా, ఆరు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యే సాబ్గా సగర్వంగా అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. ఈ అపురూప క్షణాలను టీవీలలోనూ, ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ వీక్షించిన అశేష అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











