ఎన్టీఆర్ ఓడినా అసెంబ్లీకి.. వైఎస్ జగన్పై విరుచుకుపడ్డ గరికపాటి
వైనాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలోకి దిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు జనం కర్రు కాల్చి వాత పెట్టారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టిన అదే ప్రజలు.. మధ్యలో 5ను లేపేసి 11 స్థానాలకే పరిమితం చేశారు. ఈ ఫలితాలను ఏమాత్రం ఊహించని వైఎస్ జగన్ రిజల్ట్స్ రోజున మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలకు తాను ఎంతో చేశానని.. ఇలా ఎలా జరిగిందో అర్ధం కావడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
రిజల్ట్స్ సంగతేమో కానీ జగన్కు కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కకపోవడం విశ్లేషకులను సైతం ఆశ్యర్యానికి గురిచేసింది. తమ పార్టీకి విపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్కు జగన్ వినతిపత్రం సమర్పించారు. అయితే అసెంబ్లీలో 23 మంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని , అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా సాధ్యమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కానీ జగన్ మాత్రం ప్రతిపక్షహోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు.

గతంలో 151 మంది ఎమ్మెల్యేలతో బలంతో విజయ గర్వంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్.. నేడు 11 మంది సభ్యులతో ఓ మూలన కూర్చోవాల్సి వచ్చింది. కూటమి ఎమ్మెల్యేల ముందు తాము నిలబడలేమన్న భయంతో శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా రెండు నిమిషాల్లో ముగించి వేగంగా కారెక్కి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిపోయారు జగన్. ఆ తర్వాత వైసీపీ అధినేత అసెంబ్లీలో కనిపించడం మానేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ తేల్చిచెప్పేశారు.
ఇది సరైన నిర్ణయం కాదని.. నిర్మాణాత్మకంగా ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన దశలో ఇలా వెనక్కి తగ్గడం కరెక్ట్ కాదని జగన్కు పలువురు సూచిస్తున్నారు. స్వయంగా ఆయన చెల్లెలు, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం జగన్పై సెటైర్లు వేశారు. ప్రతిపక్షనేత హోస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతాననడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని.. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదంటూ చురకలంటించారు.
ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గుంటూరులో ఆదివారం రాత్రి జరిగిన పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒక తెలుగువాడు తొలిసారిగా దేశ ప్రధాని కాబోతున్నాడని.. ఈ కార్యానికి తెలుగుదేశం పార్టీ అడ్డురాదని ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ చొరవ వల్లే నంద్యాలలో పీవీ నరసింహారావు రికార్డు స్థాయి మెజారిటీ సాధించి ప్రధానిగా దేశాన్ని పాలించారని ఆయన తెలిపారు.
సంక్షేమ పథకాలకు ముందు తెలుగును చేర్చారు తప్పించి.. తన పేరు, తనవాళ్ల పేర్లు పెట్టుకోలేని గరికపాటి అన్నారు. అంత పెద్ద మహానాయకుడైనా ఎన్నికల్లో ఓడిపోయి 1989 నుంచి 1994 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారని ప్రశంసించారు. ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ తాను అసెంబ్లీకి రానని చెప్పకుండా .. సభకు వెళ్లి ప్రజా సమస్యలు చర్చించారని గరికపాటి నరసింహారావు గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. గరికపాటి ఈ వ్యాఖ్యలు చేసింది వైఎస్ జగన్ను ఉద్దేశించేనా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











