తెలుగు రాష్ట్రాల్లో వారాహి నవరాత్రులకు క్రేజ్, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్తో అమ్మవారి సేవలో భక్తజనం
భారతదేశంలో సినిమా ఒక మతమైతే .. నటీనటులు దేవుళ్లు. వారిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు అభిమానులు. వారి వేషభాషలు, రూపం, అలవాట్లు, అభిరుచులు అన్నింటిని ప్రజలు చాలా క్లోజ్గా వాచ్ చేస్తారు. హీరోలు ధరించే బట్టలు, వాడే వస్తువులు తమకు కూడా కావాలని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా సరే వెనుకాడని వారు ఎందరో. వీరి క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు నకిలీ గాళ్లు కూడా రెడీగా ఉంటారు.
తెలుగునాట పవర్స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ఆయను దైవంలా కొలుస్తారు. సినిమాల్లో నటన, డ్యాన్సులు, ఫైట్స్ కంటే తన వ్యక్తిత్వంతోనే పవన్ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎదుటి వ్యక్తి కష్టంలో ఉంటే ఆదుకునే గుణం, ప్రశ్నించే తత్త్వం ఆయనను మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టింది. పవన్ కళ్యాణ్కు అభిమానులు ఉండరు భక్తులే ఉంటారని హరీశ్ శంకర్, బండ్ల గణేష్ వంటి వారు అన్న మాటలు అక్షర సత్యం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ బంపర్ విక్టరీలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పదేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఈసారి జగన్ను అథ: పాతాళానికి తొక్కుతానని చెప్పిన పవన్ .. శక్తివంతుడైన ప్రత్యర్ధిని ఓడించాలంటే తన బలం చాలదని గ్రహించి టీడీపీ, బీజేపీలతో జత కట్టారు.
ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ''వారాహి ''వాహనం. తన యాత్రల కోసం ప్రత్యేక వాహనం ఉంటే బాగుంటుందని భావించారు. సైనికులు వాడే వాహనాన్ని పోలిన బస్సును సిద్ధం చేయించిన ఆయన వీఐపీలు వాడే కేరవాన్ని తన టేస్ట్కు తగ్గట్టుగా అత్యాధునిక సదుపాయాలతో మలచుకున్నారు పవన్ . ఆ వాహనానికి 'వారాహి' అని నామకరణం చేశారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు.

లలితా దేవికి సైన్యాధ్యక్షురాలిగా ఆమెను శాస్త్రాలు పేర్కొంటాయి. యుద్ధంలో నలుదిక్కుల నుంచి కాపాడే వారాహీ అమ్మవారి పేరును తన వాహనానికి పెట్టుకున్న పవన్ కళ్యాణ్ .. ఆమె ఆశీస్సులతో ఎన్నికల రంగంలోకి దూకారు. గతేడాది వారాహి అమ్మవారి నవరాత్రుల్లో చివరి మూడు రోజులు కఠినమైన ఉపవాస దీక్ష చేశారు. తన కృషి, పట్టుదలతో పాటు భగవంతుడి ఆశీస్సులతో ఎన్నికల రణక్షేత్రంలో విజయం సాధించారు.
తాజాగా వారాహీ నవరాత్రులు మొదలవ్వడంతో మరోసారి అమ్మవారి దీక్ష స్వీకరించారు పవన్ . ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకున్నారు. దీక్షకు అనుగుణంగా సాంప్రదాయ వస్త్రాలను ధరించి రోజువారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా తెలుగు నాట వారాహి అమ్మవారి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా వారాహి నవరాత్రులను నిర్వహిస్తున్నారు.

ప్రజల్లో వారాహి అమ్మవారిపై గురి కుదరడానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ కారణమని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. మిడిల్ క్రాఫ్, మార్షల్ ఆర్ట్స్, వన్ సైడ్ కాలేజ్ బ్యాగులు, అవెంజర్ బైకులు, చివరికి చెగువేరా ఇలా పవన్ ఏది చేస్తే అది అభిమానులు ఫాలో అయ్యారు. ఇప్పుడు వారాహి అమ్మవారి కారణంగానే పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో జనం కూడా ఆమె దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకుని ఉండొచ్చని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏదైతే ఏం ఈ రకంగానైనా సనాతన సాంప్రదాయం, మన సంస్కృతి, దైవోపాసనపై నేటి తరం ఆసక్తి చూపిస్తూ ఉండటంతో సాంప్రదాయ వాదులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు


Click it and Unblock the Notifications











