Nandamuri Balakrishna : బాలయ్యపై అస్త్రంగా పోసాని కృష్ణమురళి? .. టైం చూసి కొట్టిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లే లక్ష్యంగా బరిలో దిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ప్రజలు షాకిచ్చారు. గత ఎన్నికల్లో 151 సీట్లను కట్టబెట్టిన జనం ఈసారి కేవలం 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశారు. దీంతో జగన్ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అయితే సినీ రంగం నుంచి జగన్ను నమ్ముకుని రాజకీయాల్లోకి దిగిన కొందరు నేతల పరిస్ధితి దారుణంగా తయారైంది.
జగన్కు సినీ రంగం నుంచి మద్ధతు తక్కువే . ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు సంఘీభావం తెలిపినవారు కూడా తక్కువే. అయితే అలీ, పోసాని కృష్ణమురళి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, యాంకర్ శ్యామల వంటి వారు జగన్కు గట్టి మద్ధతుదారులుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం జగన్ వెంట ఉన్నది పోసాని, శ్యామల మాత్రమే. మిగిలిన వారి సంగతి ఏమో కానీ పోసాని మాత్రం దూకుడుగా ఉండేవారు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తత్వమే జగన్తో ఫ్రెండ్షిప్ని పెంచిందంటారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవిని కట్టబెట్టగా.. పోసానిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా నియమించారు. జగన్, వైసీపీలపై ఈగ వాలనివ్వని పోసాని కృష్ణమురళీ.. వెంటనే ప్రెస్మీట్ పెట్టి వాళ్లను ఉతికి ఆరేసేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.. చివరికి మెగాస్టార్ చిరంజీవిని కూడా వదిలిపెట్టలేదు పోసాని. 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి గెలుస్తారని అంతా ఆశించారు. అలాగే పోసాని కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత శ్యామలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు జగన్. ఈ క్రమంలో పోసాని కృష్ణ మురళిని కూడా ఆదుకోవాలని వైసీపీ బాస్ ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ జగన్ సొంత ఛానెల్ సాక్షి టీవీలో ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో ఓ కుర్చీని పట్టుకున పోసాని కృష్ణ మురళి నిలబడతారు. ప్రోమో చివరిలో కమింగ్ సూన్ అని ఉంటుంది కానీ ఏ వివరాలు పంచుకోరు. అయితే పోసాని హోస్ట్గా అవతారం ఎత్తినట్లుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పొలిటికల్గా, సినిమాల పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పోసాని ద్వారా టాక్ షో లాంటిది జగన్ ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఎదో గట్టి planning తో ప్రోగ్రాం plan చేసారు పోసాని... pic.twitter.com/qsGI8uFyXU
— Anitha Reddy (@Anithareddyatp) November 2, 2024
అయితే నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 ఇటీవల లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తన మార్క్ మేనరిజం, అల్లరి, ఇంటర్వ్యూ చేసే స్టైల్తో అన్స్టాపబుల్ను గ్రాండ్ సక్సెస్ చేశారు బాలయ్య. ఇప్పటికే తొలి ఎపిసోడ్ను తన బావ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నిర్వహించి సీజన్ను ఘనంగా ఆరంభించారు. రెండో ఎపిసోడ్ను లక్కీ భాస్కర్ టీమ్తో చేసి బాలయ్య దూకుడు మీదున్నారు. ఈ క్రమంలోనే పోసానితోనూ ఆ తరహా ప్రోగ్రామ్ నిర్వహించే యోచనలో సాక్షి యాజమాన్యం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోసాని షోకి సంబంధించి త్వరలోనే వివరాలు తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











