ఆ నిర్మాతకు దక్కని జనసేన టికెట్ .. అందుకే వైసీపీకి అల్లు అర్జున్ ప్రచారం చేశాడా?
చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేయడం వరకు అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమై, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి బన్నీని అతని కుటుంబాన్ని బాయ్కాట్ చేసే పరిస్ధితికి తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్చరణ్లతో ఆయన మునుపటిలా ఉండటం లేదని.. మెగా ట్యాగ్లైన్ నుంచి బయటపడాలనే సంకేతాలను అల్లు అర్జున్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు.
అల్లు అర్జున్ చర్యలపై మెగా , పవన్ అభిమానులు తొలి నుంచి కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎన్నికల ఎపిసోడ్తో అది కాస్తా తారాస్థాయికి చేరింది. ఎన్నిసార్లు క్షమించినా, తీరు మార్చుకోకపోవడంతో మెగా ఫ్యామిలీ సైతం బన్నీపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగానే జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో వారిని ఆన్ఫాలో చేయడం దుమారం రేపుతోంది.

ఇక ఎన్నికల్లో ఘన విజయంతో పాటు డిప్యూటీ సీఎంగా పాలనలోనూ భాగం కావడంతో పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారట. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలోని అందరికీ ఆహ్వానం వెళ్లగా.. అల్లు ఫ్యామిలీకి ఏ ఇన్విటేషన్ వెళ్లలేదని ఫిలింనగర్ టాక్. దీనిని బట్టి చూస్తే.. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ని అనధికారికంగా బాయ్కాట్ చేసినట్లేనని అర్ధమవుతోంది.
అయితే ప్రతి సందర్భంలోనూ తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెబుతూనే వచ్చారు అల్లు అర్జున్. పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం కారణంగానే అప్పట్లో చెప్పను బ్రదర్ అని అనాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. షూటింగ్లు, ఇతర బిజీ షెడ్యూల్స్ వల్ల మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్లకు హాజరుకావడం లేదని కూడా తెలిపాడు. ఇక రీసెంట్గా శిల్పా రవికి ప్రచారం చేసిన సమయంలోనూ ఆయన తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, గతంలో ఇచ్చిన మాట ప్రకారం సపోర్ట్ చేశానని బన్నీ చెప్పాడు. నా అన్నవాళ్లు ఎక్కడున్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారికి తన మద్ధతు ఉంటుందని అది మేనమామ పవన్ అయినా, మామగారు చంద్రశేఖర్ రెడ్డి అయినా, మిత్రుడు శిల్పా రవి అయినా తన ట్రీట్మెంట్ ఓకేలా ఉంటుందన్నాడు.

అయితే శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం వెనుక మరో కోణం ఒకటి తెరపైకి వచ్చింది. అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీవాసు వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన బన్నీ వాసు .. గీతా ఆర్ట్స్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాసుని అల్లు అరవింద్ నిర్మాతగా చేశారు.
జనసేన పార్టీలో యాక్టీవ్గా ఉండే బన్నీ వాసుని .. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్గా నియమించారు పవన్. పొలిటికల్ అడ్వర్టైజింగ్లో అనుభవంతో పాటు మంచి పీఆర్ బలం ఉండటంతో ఈ పదవిని పవన్ ఆయనకు కట్టబెట్టారు. తనపై పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా బాగానే కష్టపడ్డారు బన్నీ వాసు. ఎన్నికల్లో పాలకొల్లు , పిఠాపురం లేదా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బన్నీ వాసు భావించారు. తీరా టికెట్ల కేటాయింపులకు వచ్చే సరికి ఆయనకు నిరాశ ఎదురైంది.

ఈ విషయాన్ని బన్నీ వాసు అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడతానని హామీ ఇచ్చారట. చెప్పినట్లే జనసేనానితో ఈ విషయంపై మాట్లాడగా.. పొత్తులు, ఇతర సామాజిక సమీకరణాలు కారణంగా టికెట్ కేటాయించలేనని అరవింద్తో పవన్ తేల్చిచెప్పారట. తాము స్వయంగా రికమెండ్ చేసినా బన్నీ వాసుకు టికెట్ దక్కకపోవడం బన్నీ మనసులో బలంగా నాటుకుపోయిందని, అందుకే తన మిత్రుడు , వైసీపీ నేత శిల్పా రవి తరపున ప్రచారం చేశాడనే గాసిప్స్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి.
కానీ అల్లు అరవింద్ ప్రతిపాదించిన వ్యక్తి బన్నీ వాసు కాదని, అనవసరంగా ఈ వివాదంలోకి ఆయనను లాగుతున్నారని నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రమాణం తర్వాత మెగా, అల్లు కుటుంబంలో విభేదాలు అంటూ అనేక కథనాలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలపై మెగా, అల్లు కుటుంబాలు, ముఖ్యంగా బన్నీ వాసు ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











