రోజా అవినీతి 3000 కోట్లు పైనే.. కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లోని వీఐపీ సీట్లలో ఒకటి నగరి. సినీనటి, మంత్రి రోజా ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ ఉండటంతో ఈ నియోజకవర్గానికి ఎక్కడా లేని ప్రాధాన్యత వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన రోజా.. ఈసారి హ్యాట్రిక్ ఖాయమనే ధీమాతో బరిలోకి దిగారు.
కానీ ఆమెకు షాకిచ్చారు నగరి ప్రజలు. వైసీపీ ఫైర్బ్రాండ్గా విపక్ష నేతలపై విరుచుకుపడుతూ నియోజకవర్గాన్ని, మమ్మల్ని గాలికొదిలేశారని జనం ఆమెపై గుర్రుగా ఉన్నారు. రెండున్నరేళ్లు మంత్రిగా అధికారంలో ఉన్నా.. నగరిలో ఎలాంటి అభివృద్ది పనులకు తోడు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో రోజా దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించారని విశ్లేషకులు అంటున్నారు.

ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి రోజా తేరుకోలేకపోయారు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమెను ప్రత్యేకంగా టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇతర కూటమి నేతలపై పరుష పదజాలాన్ని వాడారు. ఈ పరిణామాలతో రోజాను ఎలాగైనా ఓడించాలని విపక్ష నేతలు పట్టుదల ప్రదర్శించారు. ఇప్పుడు టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి చేతుల్లో పవర్ ఉండటంతో గతంలో ఏపీఐఐసీ ఛైర్మన్ , మంత్రిగా రోజా ఉన్న సమయంలో చోటు చేసుకున్న అవినీతిని బయటకు తీస్తున్నారు.
ప్రధానంగా ఆడుదాం - ఆంధ్ర, సీఎం కప్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. క్రీడా శాఖా మంత్రిగా రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. దీనికి తోడు విశాఖ రుషికొండపై జగన్ ప్రభుత్వం కట్టిన విశాలమైన ప్యాలెస్ విషయంలోనూ రోజా పేరు తెరపైకి వినిపిస్తోంది.

పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు .. రోజా విశాఖకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రుషికొండ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్ సైతం రోజాకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పారని, ఆ డబ్బుతోనే ఆమె బెంజ్ కారు కొనుగోలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రోజా అడ్డంగా బుక్కయ్యారని, నేడో రేపో ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వీరందరినీ పక్కనబెడితే.. జబర్దస్త్ కిరాక్ ఆర్పీ రోజాను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో జబర్దస్త్ నటులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఆర్పీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో జగన్కు రోజా సెల్యూట్ కొట్టే ఘటనను పట్టుకుని ఆర్పీ వేసి సెటైర్లు జనంలోకి బాగా వెళ్లింది. తాజాగా మరోసారి రోజాను టార్గెట్ చేశారు కిరాక్ ఆర్పీ.

ఆ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.3000 కోట్లు సంపాదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే దీనిపై చర్చించేందుకు రావాలని ఆర్పీ సవాల్ విసిరారు. అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, పెద్దిరెడ్డి , మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు వేలకోట్లు సంపాదించారని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలోనూ 1 శాతం కూడా అభివృద్ధి జరగలేదని, కానీ టెండర్లు వేసి బిల్లులు తీసేసుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి దీనిపై రోజా తదితరులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











