చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సీక్రెట్ భేటీ .. ఆ విషయం గురించేనా?
ఆంధ్రప్రదేశ్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కాక రేపుతున్నాయి. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఇప్పటి వరకు రెండు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చాయి. ఉత్తరాంధ్రలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించగా.. కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్ధి కేఎస్ లక్ష్మణరావుపై ఆలపాటి రాజా 82,320 ఓట్లతో గెలుపొందారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో , ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమికి షాక్ తగలడంతో మింగుడుపడటం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాముల్లో కూటమి పట్ల వ్యతిరేకత బయటపడటం చర్చనీయాంశమైంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి రఘువర్మ ఓటిపోవడం ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రమాద హెచ్చరిక వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది కూడా పాలన పూర్తి చేసుకోకముందే ఉపాధ్యాయ - ఉద్యోగ సంఘాల్లో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై క్లారిటీ రావడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరి చూపు నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. సభలో ఉన్న బలం దృష్ట్యా మొత్తం స్థానాలు కూటమికే దక్కనున్నాయి. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులు తమ లాబీయింగ్ మొదలుపెట్టారు. కూటమి పార్టీల మధ్య పదవీ పంపకాలు ఎలా జరుగుతాయి? ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీలు దక్కుతాయి? వంటి అంశాలపై చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఏకాంతంగా మంతనాలు జరిపారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయాలు, అసెంబ్లీలో బడ్జెట్ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూర్చొన్న స్థానం వరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయన పక్కన కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ వెంటనే సీఎం, డిప్యూటీ సీఎంలు ఛాంబర్కు వెళ్లారు.

ప్రధానంగా తన సోదరుడు నాగబాబుకు గతంలో ఖరారు చేసిన ఎమ్మెల్సీ స్థానం గురించే పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాగబాబు పదవి గురించి గతేడాది డిసెంబర్లోనే చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేశారు . ఎమ్మెల్సీగా ఆయనను తీసుకుని ఆపై మంత్రి పదవిని కేటాయించేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రేపో మాపో నాగబాబు అభ్యర్ధిత్వంపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 25 మందిని తీసుకునే అవకాశం ఉండగా.. ఇప్పటికే 24 మంది మంత్రులు ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు దక్కాల్సి ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. మరో పోర్ట్ఫోలియాను నాగబాబుకు కేటాయించారు సీఎం. అయితే మెగా బ్రదర్కు ఏ శాఖ ఇస్తారని జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ల సీక్రెట్ భేటీ చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











