జగన్! శవ రాజకీయాలు చేయకు.. ఎప్పుడూ నటించడమేనా.. విరుచుకుపడ్డ నాగబాబు
పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా నరికిచంపాడో వ్యక్తి. పాత కక్షలతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే హత్యకు గురైన వ్యక్తి షేక్ రషీద్ వైసీపీ కార్యకర్తగా.. నేరానికి పాల్పడిన జిలానీ టీడీపీ సానుభూతిపరుడనే ప్రచారం జరిగింది. రాజకీయ విభేదాలతోనే ఈ హత్య జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఎన్నో ఘటనల్లో మాదిరిగానే.. కళ్లెదురు ఇంత దారుణం జరుగుతున్నా.. అక్కడే ఉన్న వందలాది మంది వ్యక్తులు హత్యను ఆపేందుకు ప్రయత్నించకపోగా చుట్టూ చేరి వినోదం చూశారు. హత్య ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఇంకేముందు ఈ హత్య రాజకీయ రంగు పులుముకుంది. అధికారంలోకి రాగానే తమ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే హత్యకు పాల్పడిన జిలానీ తమ పార్టీ నాయకుడు కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మృతుడు, నిందితుడు ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు. వీరిద్దరూ వినుకొండకు చెందిన రౌడీషీటర్ పీఎస్ ఖాన్కు అనుచరులని, ఇద్దరూ గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసేవారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే 31 హత్యలు జరిగాయని.. వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని , 1050 దాడులు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రషీద్ హత్య వార్త తెలుసుకున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన తాడేపల్లికి బయల్దేరి వచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వినుకొండ బయల్దేరారు. అయితే ఆయన వెంట వైసీపీ నేతలు భారీ కాన్వాయ్తో తరలిరావడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, రోడ్లపైనే నిలిపివేశారు. అయితే జగన్ను మాత్రం పరామర్శించడానికి అనుమతించారు.
వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని.. గడిచిన 45 రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్నారు. టీడీపీ వాళ్లు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరి ఆస్తులునైనా ధ్వంసం చేయొచ్చా .. వారేం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారని జగన్ ఆరోపించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా పత్రికల ముసుగులో దిగజారిపోయాయని వైసీపీ అధినేత ఆరోపించారు.
ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి, సినీనటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ అధినేతను ప్రజలు నమ్మడం ఎప్పుడో మానేశారని దుయ్యబట్టారు. వినుకొండ హత్య పూర్తిగా వ్యక్తిగత కక్షల కారణంగా జరిగినదని .. దానికి రాజకీయ రంగు పులిమి జగన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నిర్మాణాత్మక పార్టీగా బాధ్యతగా వ్యవహరించాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ .. ఇప్పుడు అర్జెంట్గా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నటించడమే జగన్ అలవాటుగా చేసుకున్నారంటూ నాగబాబు దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నాగబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











