Net Worth: నాగబాబు ఆస్టులు ఎన్ని కోట్లంటే? మెగా బ్రదర్కు అప్పులు ఎన్ని కోట్లంటే?
మెగా బ్రదర్ నాగబాబుకు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు ఓ స్థానాన్ని ఖరారు చేశారు. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కూటమి పార్టీలకు ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా నాగబాబు ఎన్నిక లాంఛనమే. అయితే నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ వివరాల్లోకి వెళితే..
సామాన్య కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమపై నెంబర్ వన్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఆయన తర్వాత తన సోదరులు, పిల్లలు, మేనల్లుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిరు తర్వాత నాగబాబు వెండితెరపై అడుగుపెట్టారు. చిన్నా చితకా పాత్రలు వేస్తూ, నిర్మాతగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీకి చిరంజీవి మూలస్తంభమైనా.. కుటుంబంలో మిగిలిన వ్యవహారాలు చక్కబెట్టేది, వెనకుండి నడిపించేది నాగబాబేనని బహిరంగ రహస్యం. తన కుటుంబం జోలికి , ముఖ్యంగా తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ జోలికి ఎవరైనా వస్తే వాళ్లపై విరుచుకుపడతారు నాగబాబు.

అంజనా దేవి - కొణిదెల వెంక్రటావు దంపతులకు 1961 అక్టోబర్ 29న మొగల్తూరులో జన్మించారు నాగబాబు. చదువు పూర్తి చేసిన తర్వాత నాగబాబును సినిమాల వైపు నడిపించారు చిరు. రాక్షసుడు చిత్రంలో ఓ రోల్లో కనిపించారు నాగేంద్ర బాబు. తర్వాత మరణ మృదంగం, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ, ధర్మ, సూపర్ ఎక్స్ప్రెస్, పరిష్కారం, అల్లరోడు, ఆంటీ తదితర చిత్రాల్లో మెప్పించారు. ఈ దశలో వినీత్ - ప్రీత విజయ్ కుమార్ హీరో హీరోయిన్లుగా వచ్చిన రుక్మిణీ సినిమాలో పోషించిన బండబాబు రోల్ నాగబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది.
తర్వాత ఆయన హీరోగా వచ్చిన కౌరవుడులో తన విశ్వరూపం చూపించారు నాగబాబు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు తోడు కామెడీ కూడా అద్భుతంగా పండించారు. తిరిగి కొన్నేళ్ల తర్వాత చందమామ సినిమాలో అంతటి పేరు నాగబాబుకు దక్కింది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ నాగబాబు రాణించారు. తన తల్లి అంజనా దేవి పేరిట అంజనా ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాతగా మారిన ఆయన 1988లో రుద్రవీణతో నిర్మాతగా మారారు.
అనంతరం త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, కౌరవుడు, గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ చిత్రాలు నిర్మించారు. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ నష్టాలను తీసుకురావడంతో ఆర్ధికంగా కృంగిపోయారు నాగబాబు. ఈ సినిమా తర్వాత సినీ నిర్మాణానికి దూరమైన ఆయన ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా అలరించారు.
రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తిని కనబరిచే నాగబాబు.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కీలకపాత్ర పోషించారు. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో రాజకీయాల్లోనూ సైలెంట్ అయిన నాగబాబు .. పవన్ కళ్యాణ్ జనసేనతో తిరిగి యాక్టీవ్ అయ్యారు. నాగబాబును జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమించిన పవన్ ఆయనను 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ పొత్తుల్లో భాగంగా చివరి నిమిషంలో నాగబాబు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అన్నయ్యకు న్యాయం చేయాలని పవన్ నిర్ణయించారు.

తొలుత టీటీడీ ఛైర్మన్ రేసులో తర్వాత రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ నాగబాబు పేరు తెరమీదకి వచ్చింది. చివరికి ఎమ్మెల్సీ పోస్ట్ నాగబాబుకు ఖరారు చేయడం వెనుక పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నామినేషన్ తంతు కూడా విజయవంతంగా ముగించారు. ఇక నామినేషన్ పేపర్లలో తనపై ఉన్న కేసులు, ఆస్తులు, అప్పులు ఇతర వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు నాగబాబు.
తన పేరిట బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇతర ఆస్తులు కలిపి రూ.59.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో వ్యవసాయ భూములతో పాటు హైదరాబాద్ మణికొండలో విలాసవంతమైన విల్లా ఉన్నట్లు నాగబాబు తెలిపారు.
మొత్తంగా 11.20 కోట్ల స్థిరాస్థులు, రెండు బ్యాంకుల్లో రూ.56.97 లక్షల హోమ్ లోన్, రూ. 7.50 లక్షల కారు రుణం, పలువురు వ్యక్తుల వద్ద రూ. 1.64 కోట్ల అప్పులు ఉన్నట్లు నాగబాబు చెప్పారు. తన సోదరుడు చిరంజీవి వద్ద నుంచి రూ.28.48 లక్షలు, మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నుంచి రూ. 6.9 లక్షలను అప్పుగా తీసుకున్నట్లు నాగబాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు , అప్పుల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











