కేబీసీలో అమితాబ్ నోట పవన్ కల్యాణ్పై ప్రశ్న.. కంటెస్టెంట్లు ఎన్ని లక్షలు గెలుచుకొన్నారో తెలుసా?
జనసేన పార్టీని స్ధాపించి దాదాపు పదేళ్ల పోరాటం ఫలించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎంగా పగ్గాలు అందుకుని పాలకుడిగా తన మార్క్ చూపిస్తున్నారు. పవన్ రాజకీయ జీవితంలోనే అత్యంత కీలకదశలో ఉన్నారు. ప్రజలతోనే మమేకమై , సహనంతో పోరాడితే ఎప్పటికైనా సక్సెస్ సాధించొచ్చని పవన్ కళ్యాణ్ నిరూపించారు. ఆయన వేసిన బాటలో పలువురు స్టార్స్ నడిచేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ సక్సెస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వగా.. ఏకంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నోటివెంట జనసేనాని ప్రస్తావన వచ్చింది . ఆ వివరాల్లోకి వెళితే..
ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సంకల్పించిన పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. వారాహి యాత్ర, జనవాణి కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును వైఎస్ జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో తెలుగుదేశం అధినేతను పరామర్శించారు. జైలు నుంచి బయటకు వస్తూనే ఇకపై టీడీపీతో కలిసి జనసేన సాగుతుందని పొత్తు ప్రకటన చేశారు.

చంద్రబాబు విడుదలయ్యాక పొత్తు చర్చలు, ఉమ్మడి కార్యాచరణపై మంతనాలు జరిపారు. 50 నుంచి 60 స్థానాలు ఇవ్వకుంటే పొత్తు వద్దని కుల పెద్దలు హెచ్చరించినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చేందుకకు పవన్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కాషాయ పెద్దలకు నచ్చజెప్పి కూటమి ఏర్పాటుకు కృషి చేశారు. ఒకానొకదశలో బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడం కోసం చివరికి తనకు దక్కిన స్థానాలను కూడా వదులుకుని త్యాగం చేశారు పవన్.
కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. తను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పోటీ చేసిన 21కి 21 స్థానాల్లోనూ గెలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. చంద్రబాబు కేబినెట్లో డిప్యూటీ సీఎంగా, ఆరు కీలకశాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు.

టగ్ ఆఫ్ వార్ మధ్య ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడంలో పవన్ కృషి ఉందని గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను తుఫాన్ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎవరెస్ట్ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో పవన్ గురించి ప్రశ్న వచ్చింది. ఓ వృద్ధ జంట హాట్ సీట్లో కూర్చొని ఉండగా.. జూన్ 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయిన అగ్రనేత ఎవరు అని వారికి ప్రశ్న వేస్తాడు అమితాబ్.
ఆప్షన్స్గా A. పవన్ కళ్యాణ్ B. చిరంజీవి, C. నాగార్జున , D. నందమూరి బాలకృష్ణ అనే పేర్లు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసం ఆ జంట ఆడియెన్స్ పోల్ను ఎంచుకోగా 50 శాతం మందికి పైగా ఓట్లు పవన్ పేరుకే వస్తాయి. దీంతో ఆ జంట కూడా పవన్ పేరునే సెలెక్ట్ చేస్తుంది. ఇది రైట్ ఆన్సర్ అని చెప్పిన అమితాబ్ మీరు రూ.లక్షా 60 వేలు గెలుచుకున్నారని ప్రకటిస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి అమితాబ్ వివరిస్తూ.. జనసేన పార్టీ అధ్యక్షుడని, ప్రముఖ నటుడు చిరంజీవికి సోదరుడని చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











