పవన్ దెబ్బకి దిగొచ్చిన టాలీవుడ్.. చంద్రబాబుతో సినీ ప్రముఖుల భేటీ.. ఎప్పుడంటే?
సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలంటూ ఇటీవల టాలీవుడ్లో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. జూన్ 1న థియేటర్ల బంద్కు కూడా నిర్ణయం జరిగిపోయిందని మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. సరిగ్గా తాను నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ పెట్టుకుంటే ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్ధితులు చోటు చేసుకోవడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిందిగా మంత్రి కందుల దుర్గేష్ను ఆదేశించారు.
థియేటర్ల బంద్పై పవన్ సీరియస్
ఏపీ ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇండస్ట్రీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. బంద్ లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఇండస్ట్రీలో నలుగురు అగ్ర నిర్మాతలు బంద్ వెనుక ఉన్నారంటూ మీడియాలో విస్త్రతంగా కథనాలు వచ్చాయి. పవన్ సినిమాను తొక్కేయాలని కొందరు కుట్ర చేశారని పుకార్లు వైరల్ అయ్యాయి. ఆ వెంటనే నిర్మాతలు అల్లు అరవింద్, దిల్రాజులు మీడియా ముందుకు వచ్చి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చారు.

దిల్రాజుపై అత్తి సత్యనారాయణ ఆరోపణలు
థియేటర్ల బంద్ వెనుక జనసేన నేత అత్తి సత్యనారాయణ ఉన్నారంటూ దిల్రాజు ఆరోపించడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్. అలాగే రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా తప్పించారు. తన నిర్దోషిత్వం నిరూపించుకుంటానని అత్తి సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చారు. అసలు బంద్ ఆలోచన చేసిందే దిల్రాజు అతని సోదరుడు శిరీష్ రెడ్డి అని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సీరియస్ అయ్యేసరికి తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్న పవన్
ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సినీ పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా నేటి వరకూ సినీ ప్రముఖులు .. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవలేదని మండిపడ్డారు. అలాగే టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే సంప్రదించాలని పవన్ హుకుం జారీ చేశారు. ఎవరూ వ్యక్తిగతంగా కలవడానికి వీల్లేదని.. ఫిలిం ఛాంబర్ ద్వారా వచ్చిన దరఖాస్తు ఆధారంగానే ఇకపై నిర్ణయాలుంటాయని తేల్చి చెప్పారు.
పవన్ దెబ్బకు దిగొచ్చిన టాలీవుడ్
రాష్ట్రంలో థియేటర్ల మౌలిక సదుపాయాలు, పన్ను వసూలు తదితర అంశాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వరుసపెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ను, ఏపీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలని సినీ పెద్దలు భావించారు. దీనిలో భాగంగా ఈ నెల 15న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, తాజా పరిణామాలపై చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు హాజరవుతారో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











