చోటా గబ్బర్ సింగ్ కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. అరుదైన వ్యాధికి గురైన బాలుడి నుదుటిపై ముద్దు పెట్టి..
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ కోరికను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీర్చాడు. కొద్ది రోజులుగా మంచానికే పరిమితమైన జీవితంతో పోరాటం చేస్తున్న బాలుడికి పవన్ కల్యాణ్ను చూడాలనే కోరిక కలిగింది. ఆ విషయాన్ని జన సేనానికి చేరవేయగా.. తన అభిమానిని కలుసుకొనేందుకు జూన్ 17 బుధవారం హన్మకొండకు బయలుదేరారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అంతేకాకుండా వారి ఆర్థిక పరిస్థితిని కూడా తెలుసుకొన్నారు. ఆ తర్వాత వారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని తమ జనసేన నేతలకు సూచించారు. పవన్ కల్యాణ్లోని మానవీయ కోణం ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకొన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులను, అభిమానులను ఈ సంఘటన కదిలించింది. నిరంజన్ను పట్టి పీడిస్తున్న వ్యాధి ఏమిటి? పవన్ కల్యాణ్ పరామర్శ పర్యటనలో జరిగిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..
హన్మకొండలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న పొనుగోటి రాంగోపాల్, మానస కుమారుడు నిరంజన్ 17 ఏళ్లు. కొద్దికాలంగా డీఎన్డీ (DND) అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. శారీరకంగా ఎదుగుదల లేని బాలుడు మంచానికే పరిమితమయ్యారు. అయితే నిరంజన్ మాత్రం తన వ్యాధిని ఎదురించడమే కాకుండా పవన్ కల్యాణ్ను విపరీతంగా అభిమానిస్తాడు. అయితే తనకు పవన్ కల్యాణ్ను చూడాలని ఉందనే కోరికను బయటపెట్టడం..ఆ విషయాన్ని తెలంగాణ జనసేన నేతలు ఆయన దృష్టికి తీసుకు రావడంతో జన సేనాని స్వయంగా పరామర్శించాలని నిర్ణయించుకొన్నారు.

గత మూడు, నాలుగు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకొన్నారు. తమ నాయకులతో కలిసి బుధవారం ఉదయం హన్మకొండకు చేరుకొన్నారు. ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే నిరంజన్ను చూసి పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. తన అభిమాని ఆరోగ్య పరిస్థితి చూసి చలించిపోయారు. నిరంజన్తో చాలా సమయం గడిపారు. తనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిరంజన్ మంచంపైనే కూర్చొన్నారు. నుదిటిపై ముద్దు పెట్టి అప్యాయంగా పలకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని బాలుడిపై కప్పి అక్షింతలతో ఆశీర్వదించారు. భద్రకాలి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తాన అని తెలిపారు. ఆరోగ్యంతో ఉన్న సమయంలో తనను అనుసరిస్తూ చేసిన డ్యాన్సులు, చెప్పిన డైలాగ్స్, ఫోటోలను పవన్ కల్యాణ్ చూశారు. తనను చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని చెప్పినప్పుడు నిరంజన్ తలను పవన్ కల్యాణ్ ప్రేమగా నిమిరి భుజం తట్టారు.

వ్యాధి వివరాలు తెలుసుకొన్నారు? వైద్యం ఎక్కడ చేయిస్తున్నారని అడిగారు. అతడి వైద్యం గురించి, వైద్య చికిత్సకు కావాల్సిన ఆర్థిక వివరాలు, అతడిని కాపాడుకోవడానికి తాను ఏం చేయాలి అనే విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించారు. భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి అని తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల సహాయాన్ని అందించారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశారు. గతంలో కాకతీయ హాస్పిటల్లోని క్యాంటిన్లో పనిచేసే వారమని నిరంజన్ తల్లిదండ్రులు చెబితే.. వారి జీవనోపాధి మెరుగు పరిచేందుకు మరో క్యాంటీన్ పెట్టించి ఆదుకోవాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు దిశానిర్ధేశం చేశారు. నిరంజన్ను పరామర్శించిన తర్వాత భద్రకాళి అమ్మవారిని పవన్ కల్యాణ్ దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు.


Click it and Unblock the Notifications