పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. నిందితుడిని వదలొద్దు.. పవన్ కల్యాణ్ సీరియస్
పిఠాపురం నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పిఠాపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి.. ఓ యువకుడు ఆటోలో ఎక్కించుకొన్నాడు. ఊరు చివర్లలోని మాధవపురం డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే స్థానికులు సకాలంలో స్పందించడంతో భారీ ఘోరం తప్పింది. అయితే గ్రామస్థులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని దుర్గాడ జాన్గా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు పంపించారు. ఈ కేసును అధికారులు వెంటనే స్పందించి.. నిందితుడిని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది అని తన ప్రకటనలో పేర్కొన్నారు.

స్థానికులు స్పందించకపోతే నిందితుడు తప్పించుకోడానికి వీలుండేది. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను అని అన్నారు.
ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందచేస్తాం. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని స్పష్టం చేశాం అని డిప్యూటీ సీఎం తన ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











