పవన్ కల్యాణ్కు ఆ నలుగురు రిటర్న్ గిఫ్ట్? డిస్ట్రిబ్యూషన్ దందాపై సర్కార్ సీరియస్.. ప్రక్షాళనకు చర్యలు!
గత ప్రభుత్వంలో ఎదురైన అవమానాలు, చీత్కారాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు సినీ పరిశ్రమకు గౌరవం ఇచ్చేలా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటున్నది. పార్టీలకు సంబంధం లేకుండా సినిమాలకు, నిర్మాతలకు ప్రోత్సాహం ఇవ్వడానికి అనేక చర్యలు చేపట్టింది. చలన చిత్ర రంగ అభివృద్దికి అందరూ కలిసి రావాలని డిప్యూటీ సీఎం ప్రకటించినా సానుకూలంగా స్పందించకపోవడం ఓ వివాదంగా మారింది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకొనేందుకు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ల మూసివేత అంటూ చేసిన కుట్రపై పవర్ స్టార్ అభిమానులు గత కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రతిఘటించారు. దాంతో పరిస్థితి విషమిస్తుందనే గ్రహించిన ఫిలిం ఛాంబర్ తగిన నిర్ణయం తీసుకొన్నది. గత వారం రోజులుగా సాగిన వ్యవహారాలపై పవన్ కల్యాణ్ కార్యాలయం ఓ ప్రకటనతో కూడిన వార్తను రిలీజ్ చేసింది. ఆ వ్యవహారాల్లోకి వెళితే..
థియేటర్ల మూసివేతపై ఆగ్రహం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే - తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించినా సానుకూలంగా స్పందించలేదు. అయితే సినిమా పరిశ్రమలోని ఆ నలుగురు తీసుకొన్న నిర్ణయం. వారు తనకు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్పై పవన్ కల్యాణ్ సీరియస్గా తీసుకొన్నట్టు సమాచారం.

సినీ రంగానికి పరిశ్రమ హోదా
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు చర్యలు తీసుకొంటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. సినీ పరిశ్రమ నుంచి వ్యక్తిగతంగా రావడం ఎందుకు? ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొని అందరూ కలిసి రండి. సమిష్టిగా నిర్ణయం తీసుకొందాం అని దిల్ రాజు, అల్లు అరవింద్, డీ సురేశ్ బాబు, శ్రీమతి వై సుప్రియ, చినబాబు, సీ అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు ఆయన సూచించాడు. ఆ తర్వాత వ్యక్తిగతంగా వచ్చి టికెట్ రేట్లు పెంచమని వినతి పత్రం సమర్పిస్తే.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

నిర్మాతల రిటర్న్ గిఫ్ట్పై నజర్
అయితే ఇటీవల తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూషన్ రంగంలో అధిపత్య పోరాటంతో సినిమా థియేటర్లను మూసివేతకు నిర్ణయం తీసుకోవడంపై అనేక విధాలుగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి పండగ తర్వాత సినిమా పరిశ్రమ ఆదరణ కోల్పోయి సంక్షోభం దిశగా ప్రయాణిస్తుండటంతో నిర్మాతలు అందోళన పడ్డారు. ప్రేక్షకుడిని థియేటర్కు ఎలా రప్పించాలా? అనే ఆలోచనల్లో పడినప్పుడు..ఇండస్ట్రీలో ఆ నలుగురిగా ముద్ర పడిన నిర్మాతలు.. సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్టుగా భావిస్తున్నారు. సినిమా పరిశ్రమ మేలు కోసం ప్రయత్నిస్తుంటే.. ఏకంగా నా సినిమాపైనే కుట్ర పన్నుతారా? అనే భావనలో ఉన్నట్టు తెలిసింది.

ఇక నుంచి వ్యక్తిగత సమావేశాలకు చెక్
ప్రభుత్వ ప్రోత్సాహాకాలను, సహాయ సహకారాలకు గండి కొడుతూ డిస్ట్రిబ్యూటర్లు తీసుకొన్న ప్రతికూల నిర్ణయంపై పవన్ కల్యాణ్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న దందాతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా ప్రేక్షకుడు పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై దృష్టిపెట్టారు. థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని విషయం అధికారుల దృష్టికి వచ్చింది.

పన్ను చెల్లింపు విధానంపై కొరడా
సినిమా టికెట్ ధరలు పెంచినప్పుడు దానికి మొత్తంగా పన్ను పెరిగిందా? టికెట్ రేట్లను పెంచిన విధంగా ప్రేక్షకుడికి సౌకర్యాలు అందాయా? థియేటర్ లీజ్ దారుల నుంచి సక్రమంగా పన్ను చెల్లింపు ఉందా? టికెట్ల సేల్కు, పన్నుకు ఏదైనా వ్యత్యాసం ఉందా? ముఖ్యంగా రాయలసీమ నుంచి పన్ను చెల్లింపు ఎలా ఉంది? పన్ను చెల్లింపులో ఏ మేరకు వ్యత్యాసం ఉంది? సినిమా థియేటర్లలో పారిశుద్ధ్య పరిస్థితులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సినిమా హాళ్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర పానీయాల ధరలు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఉన్నాయా? తిను బండారాలు నాణ్యత ఉందా? అనే విషయాలపై సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.
థియేటర్లో ఫుడ్, ఇతర సౌకర్యాలపై దృష్టి
సింగిల్ థియేటర్ల మూసివేత సంక్షోభం తర్వాత విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో, రాష్ట్రంలోని సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఉన్ని ఉన్నాయి? వాటి వివరాలను సినిమాటోగ్రఫి మంత్రిత్వ శాఖ సేకరించే పనిలో ఉంది. వాటిలో ఆహార పదార్థాల నాణ్యత, వాటి ధరలపై ఇక నుంచి దృష్టిపెట్టాలని నిర్ణయించారు. సినిమా రంగంలో స్టూడియోల నిర్వాహణ నుంచి సినిమా హాల్స్ వరకూ ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం ఉండకుండా ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది అనే దిశగానే పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నారు అని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు అత్యంత సానుకూలంగా ఉన్న ఏపీ ప్రభుత్వం తాజా సంక్షోభంతో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. టికెట్ రేట్లు, బెన్ఫిట్ షోలు, ఇతర అనుమతులపై కాస్తంతా సీరియస్గానే వ్యవహరించే అవకాశం ఉంది. ఈ మారిన తాజా నిర్ణయాలపై ఆ నలుగురు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











