Pawan Kalyan Prashcit Deeksha: తిరుపతి లడ్డు తయారీలో అపచారం.. పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష
కలియుగ వైకుంఠం సన్నిధిలో తిరుపతి లడ్డులో జంతు కళేబరాల నుంచి వచ్చిన నూనె కలపడంతో మహా అపచారం చోటు చేసుకొన్నది. జాతీయ సంస్థలు, ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేశాయి. అత్యంత మహా ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ తయారీలో ఇలాంటి దుర్మార్గానికి పాల్పడటంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనుసరించిన విధానాలు భక్తుల మనోభావాలను దెబ్బ తీశాయి. లడ్డూలో పంది, బఫెలో నుంచి తీసిస కొవ్వు పదార్థాల మిశ్రమాన్ని, ఆయిల్ను వాడటమే విషయం తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అందుకు బాధ్యులైన వారిని కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచించారు.

అయితే తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన అపచారానికి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్తం చేసుకొనేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఆదివారం (సెప్టెంబర్ 22వ తేదీ) నుంచి 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తిన్న తరుణంలో ప్రాయశ్చిత్తం కోసం ఈ దీక్ష చేపడుతున్నట్టు ఆయన చెప్పారు.
తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని తెలిసి తీవ్ర వేదనకు గురయ్యాను. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభించే 11 రోజులపాటు దీక్షను కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను అని ఆయన అన్నారు.

జాతీయ మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. లడ్డూ తయారీ విధానంలో అనుసరించిన దుర్మార్గపూరితమైన అపచారం చూసి గుండె బాధతో ద్రవిస్తున్నది. ఆ విషయం తెలియగానే చాలా ఘోరంగా అనిపించింది. చేప నూనే, జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డూను తిన్నామనే విషయం తెలిసి తట్టుకోలేకపోయాను. గత నాలుగేళ్ల నుంచి ఇలాంటి అపచారం గురించి వ్యక్తమైన అనుమానాలు నిజమయ్యాయి అని అన్నారు.
లడ్డూ ప్రసాదం విషయంలో ఇలాంటి అపచారం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు.అందుకే వ్యక్తిగతం ప్రాయశ్చిత్త దీక్షను చేపడుతున్నాను. ఆ దీక్ష ముగిసిన తర్వాత బాలాజీ దేవుడిని దర్శించుకొంటాను అని మీడియాకు తెలిపారు.


Click it and Unblock the Notifications











