ఆంటీ, డైమండ్ రాణి .. ఇప్పుడు ఇంటి గుమ్మం దాటి రాగలవా?.. రోజాకు సవాల్
లక్షలాది మంది అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పాలకుడిగా మారారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. ఈసారి ప్రభుత్వంలోనూ భాగం కావాలని భావించిన పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు.
బుధవారం సెక్రటేరియట్కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. బ్లాక్ - 2లోని తన ఛాంబర్లో సర్వమత ప్రార్థనల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై పవన్ సంతకాలు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఫైల్పై తొలి సంతకం చేసిన జనసేనానికి అధికారులు అభినందనలు తెలిపారు. తన వదిన సురేఖ ఇటీవల బహుకరించిన ఓ కాస్ట్లీ పెన్నుతో పవన్ సంతకం చేశారు.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆ పెన్ను మరిచిపోయినట్లుగా గుర్తించిన పవన్ .. సిబ్బందికి చెప్పి సూట్కు కేసును తెప్పించి అందులో ఉన్న పెన్ను తీసుకుని మంత్రిగా సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. టీవీలు, మొబైల్స్లో పవన్ బాధ్యతల స్వీకారాన్ని వీక్షించారు. అనంతరం సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు తెలిపారు. మీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే గతంలో మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను వారు గుర్తుచేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ వార్డ్ మెంబర్గా కూడా గెలవలేడని, గతంలో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడని రోజా ఎద్దేవా చేశారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్నాడని.. ఆయన అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేడని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటిపై అప్పట్లోనే జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తాజాగా టీడీపీ నేత వర్మను సచివాలయం వద్ద రోజా వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన తనదైన శైలిలో కౌంటరిచ్చారు. '' పవన్ను అసెంబ్లీ గేట్ దాటనివ్వనన్న మా ఆంటీ , డైమండ్ రాణి గారు.. దమ్ముంటే ఇంట్లో గుమ్మం దాటగలరా . మాట మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలో, నేర్చుకోవాలి. ఆ సంస్కారం జగన్మోహన్ రెడ్డికి లేదు, కిందనున్న వాళ్లకి లేదు అని వర్మ ఘాటుగా అన్నారు.

ఒక నాయకుడు రౌడీ అయితే , అందరూ రౌడీలుగానే ఉంటారు. పవన్ను అసెంబ్లీ ముట్టకోనిచ్చేది ఏంటీ తన్నుకుంటూ వెళ్లమని పిఠాపురం ప్రజలు 70 వేల ఓట్లకు పైగా మెజారిటీ ఇచ్చారు. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, ఎన్విరాన్మెంట్ ఇలా కీలకమైన శాఖలు దక్కాయి '' అని వర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











