పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తానన్నారు..కానీ అల్లు అరవింద్ వల్ల పోటీ చేయలేదు.. బన్నీ వాసు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబం మొత్తం పిఠాపురంలో ఉంటే అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లడానికి కారణాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. ఈ వివాదం నేపథ్యంలో నిర్మాత బన్నీవాసు పేరు తెరపైకి వచ్చింది. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన బన్నీ వాసు .. గీతా ఆర్ట్స్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాసుని అల్లు అరవింద్ నిర్మాతగా చేశారు. జనసేన పార్టీలో యాక్టీవ్గా ఉండే బన్నీ వాసుని .. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్గా నియమించారు పవన్.
పొలిటికల్ అడ్వర్టైజింగ్లో అనుభవంతో పాటు మంచి పీఆర్ బలం ఉండటంతో ఈ పదవిని పవన్ ఆయనకు కట్టబెట్టారు. తనపై పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా బాగానే కష్టపడ్డారు బన్నీ వాసు. ఎన్నికల్లో పాలకొల్లు , పిఠాపురం లేదా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బన్నీ వాసు భావించారు. తీరా టికెట్ల కేటాయింపులకు వచ్చే సరికి ఆయనకు నిరాశ ఎదురైంది.

ఈ విషయాన్ని బన్నీ వాసు అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడతానని హామీ ఇచ్చారట. చెప్పినట్లే జనసేనానితో ఈ విషయంపై మాట్లాడగా.. పొత్తులు, ఇతర సామాజిక సమీకరణాలు కారణంగా టికెట్ కేటాయించలేనని అరవింద్తో పవన్ తేల్చిచెప్పారట. తాము స్వయంగా రికమెండ్ చేసినా బన్నీ వాసుకు టికెట్ దక్కకపోవడం బన్నీ మనసులో బలంగా నాటుకుపోయిందని, అందుకే కావాలని వైసీపీకి ప్రచారం చేశారని ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ' ఆయ్ ' మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థీమ్ సాంగ్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై విలేకరులు బన్నీ వాసును ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 2029 వరకు జీఏ2ని సెట్ చేసి రాజకీయాల్లోకి వెళ్లు, అవసరమైతే తానే ఎలక్షన్ ఖర్చును మొత్తం భరిస్తానని ఈలోపు వెళితే కాళ్లు విరగ్గొడతానని అల్లు అరవింద్ వార్నింగ్ ఇచ్చారని వాసు తెలిపారు. ఆయన చెప్పింది నిజమేనని అనిపించిందని, కంపెనీ ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సి ఉందన్నారు.

2019 ఎన్నికల సమయంలో పాలకొల్లు నుంచి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని, దీంతో తానింకా చిన్నపిల్లోడినని చెబితే.. అలా ఆలోచించొద్దు, ఓడిపోయినా పర్లేదు, కానీ నువ్వొక క్యాండిడేట్ అవుతావని అన్నారని బన్నీ వాస్ తెలిపారు. భయపడొద్దని.. ఏదైతే అదే అవుతుంది ధైర్యంగా అడుగు వేయాలని పవన్ చెప్పారని.. కానీ అప్పుడు నాకు భయం వేసిందన్నారు. తాజా ఏపీ ఎన్నికలకు ముందు కూడా ఏంటీ, ఇంకా టైం తీసుకుంటావా అని పవన్ అడిగారని ... అరవింద్ గారితో మాట్లాడి చెబుతానని చెప్పడంతో పవన్కు అర్ధమైందని .. నువ్వు ఏ రోజైతే సొంతంగా నిర్ణయం తీసుకుంటావో ఆ రోజున నా దగ్గరికి రమ్మని చెప్పారని బన్నీ వాస్ వెల్లడించారు. ఈ మాటలతో చాలా విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. ఇకనైనా మెగా - అల్లు ఫ్యామిలీలపై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











