‘దినదిన గండంగా శ్యామల, పోసాని జీవితం.. చంపేస్తారనే భయంతో ఇంట్లోనే బిక్కు బిక్కుమంటూ’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు , అవినీతిని ప్రస్తుత ప్రభుత్వం తవ్వి తీస్తోంది. అంతేకాదు.. గతంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సహా ఇతర కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కూటమి కేడర్ టార్గెట్ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోగా.. వైసీపీ నాయకులు, ఆ పార్టీ మద్ధతుదారులకు బెదిరింపులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో సినీనటి, యాంకర్ శ్యామల కూడా ఒకరు.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన శ్యామల.. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు . ఈ సందర్భంగా ఓ ఛానెల్లో మాట్లాడుతూ .. ముసలి తోడేలు, గుంట నక్క కథ చెప్పింది. ఇది పరోక్షంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్లను ఉద్దేశించినదేనంటూ రెండు పార్టీ శ్రేణులు నోటికి పనిచెప్పాయి. సోషల్ మీడియాలో అయితే శ్యామలను దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి రావడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమెస్తోందని తనను బతకనీయండి అన్నా అంటూ ఓ వీడియలో ఆమె ఎమోషనల్ అయ్యారు.

అయితే శ్యామల వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని చంద్రబాబు, పవన్ అభిమానుల మనసులను తీవ్రంగా గాయపరిచింది. తాజాగా నిర్మాత నట్టికుమార్ శ్యామలపై మండిపడ్డారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన ప్రాణం జగన్ అని శ్యామల చెప్పిందని, ఇందులో తప్పులేదని ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుందని నట్టికుమార్ అన్నారు. కానీ అభిమానం హద్దులు దాటి ఎదుటి ఫ్యామిలీని తిట్టే విధంగా ఉండకూడదని చురకలంటించారు. తల్లిదండ్రులను గుంట నక్క అని పిలుస్తావా అని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ను గుంటనక్క అంటావా.. ఆయనతో పోలిస్తే నీ స్థాయి ఎక్కడ అని నట్టికుమార్ నిలదీశారు. శ్యామల చాలా గొప్పది కావొచ్చు, 10 సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ కావొచ్చు, మనీలాండరింగ్లో మీ ఆయన కోట్లు సంపాదించొచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి నీకు కోట్లు ఇవ్వొచ్చు, కానీ ఎదుటి వారిని అంతగా అవమానించే విధంగా వ్యవహరించకూడదన్నారు.

ఆడపిల్ల కాబట్టి శ్యామలను ఏం అనడం లేదు కానీ, ఆమె ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతున్నారని నట్టికుమార్ చెప్పారు. ఇంటికి రెండు మూడు తాళాలు వేస్తున్నారని, సెక్యూరిటీని పెంచేస్తున్నారని , దినదినగండంగా బతుకుతున్నారని అన్నారని. అయితే శ్యామలను ఎవరూ ఏం చేయరని ఆయన పేర్కొన్నారు.
ఇక నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీపైనా నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో ఉన్న అన్ని తలుపులు మూసేసి , పాలవాడు వచ్చినా తీయడం లేదని చెప్పారు. వీరితో పాటు కమెడియన్ అలీ మరికొందరి పరిస్ధితి కూడా ఇలా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నట్టికుమార్ వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసలు అనడమెందుకు , ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతకడమెందుకని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











