‘రిషికొండ’లో అడ్డంగా బుక్కైన రోజా.. డైమండ్ రాణి మెడకు బెంజ్ కారు వివాదం?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన నిధులు, ఈ దశలో చోటు చేసుకున్న అక్రమాలను ఒక్కొక్కటిగా తవ్వితీస్తోంది. మద్యం, ఇసుక, భూ కబ్జాలు, గనుల అక్రమ మైనింగ్ తదితర అంశాల్లో చోటు చేసుకున్న అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని రుషికొండ ఏరియాలో నిర్మించిన భవనాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిలు ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. అయితే తాను విశాఖకు మకాం మారిస్తే నివసించేందుకు పరిపాలనకు వీలుగా రుషికొండపై విలాసవంతమైన, రాజభవనాలను తలపించే బిల్డింగ్లను జగన్ నిర్మించారు.

వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు పైకి పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరుతో కడుతున్నామని చెప్పినా, అది నాటి ముఖ్యమంత్రి జగన్ కోసమేననే ప్రచారం జరిగింది. రుషికొండను బొడిగుండును కొట్టడంతో పర్యావరణ నిబంధనలను జగన్ గాలికొదిలేశారనే విమర్శలను అప్పట్లోనే విపక్షాలు చేశాయి. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం వైపు ఎవరినీ అనుమతించకుండా , అత్యంత కట్టుదిట్టంగా కన్స్ట్రక్షన్ జరిపించారు.
భారీ యంత్రాలతో రాత్రి, పగలు విరామం లేకుండా కొండను తవ్వేసి బోడిగుండు కొట్టారు. ఈ విషయంలో న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా, నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని మొత్తుకున్నా జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో అసలు రుషికొండ ప్యాలెస్లో ఏముందనేది ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో కూటమి శ్రేణులతో కలిసి ఈ భవనాలను పరిశీలించారు.

విశాలమైన రాజప్రాసాదాన్ని తలపించేలా ఉన్న ఈ భవనం ఫోటోలు, వీడియోలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఖరీదైన ఫర్నీచర్, అడుగు అడుగునా బంగారు తోడుగులతో కూడిన వస్తువులు కనిపించాయి. అన్నింటిలోకి రూ.26 లక్షల విలువ చేసే బాత్ టబ్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఏడు బ్లాక్లలో భవనాన్ని నిర్మించగా.. కళింగ బ్లాక్లోనే సీఎం క్యాంప్ కార్యాలయం, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చొనే కంట్రోల్ రూమ్, 175 మంది కూర్చొనేందుకు వీలుగా సభా మందిరం నిర్మించారు. వేంగి ఏ, వేంగి బీ, కళింగ, గజపతి, విజయనగరం ఏ, విజయనగరం బీ, విజయనగరం సీ అనే పేర్లతో మొత్తం ఏడు బ్లాకుల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, గెస్ట్ రూములు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్ వంటివి నిర్మించారు.
రుషికొండ ప్యాలెస్ వ్యవహారంపై కూటమి శ్రేణులు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి రోజా కౌంటరిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని అనుమతులతోనే , అత్యద్భుతంగా నిర్మించామని .. విశాఖను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ భవనాన్ని నిర్మించడం తప్పా అని ఆమె ప్రశ్నించారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టిన వారికి రుషికొండ భవనం చూసి కళ్లు కుడుతున్నాయని రోజా ఎద్దేవా చేశారు. ఆమె వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు.

రుషికొండ నిర్మాణాలు తర్వాత ముందు.. రోజా ఆ బెంజ్ కారు గురించి చెప్పాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు .. రోజా విశాఖకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిందని భానుప్రకాష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రుషికొండ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్ సైతం రోజాకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పారని, ఆ డబ్బుతోనే ఆమె బెంజ్ కారు కొనుగోలు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రోజా రుషికొండ ప్యాలెస్పై ఆగమేఘాలపై స్పందిస్తోందని భానుప్రకాష్ చురకలంటించారు. ఈ వ్యాఖ్యలపై రోజా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కానీ భానుప్రకాష్ మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











