మాధవీలతకు క్షమాపణలు .. నోట్ల కట్టలు విసురుతూ జేసీ షాకింగ్ కామెంట్స్
సినీనటి , బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు, ప్రత్యర్ధులపై విరుచుకుపడే జేసీ ఓ హీరోయిన్ను టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కొత్త ఏడాదిని పురస్కరించుకుని తాడిపత్రిలోని మహిళల కోసం ప్రభాకర్ రెడ్డి స్థానికంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై మాధవీ లత ఘాటు విమర్శలు చేశారు. జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దని.. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
మాధవీలత వ్యాఖ్యలపై మండిపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన నోటికి పనిచెప్పారు. మహిళలను కించపరిచేలా ఆమె మాటలు ఉన్నాయని, జేసీ పార్క్లో ఎలాంటి దారుణ సంఘటనలు జరగడం లేదన్నారు. మాధవీలత ప్రాస్టిట్యూట్, వేస్ట్ ఫెలో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పేముంది? అని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.

తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాధవీలత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సినిమాల్లో నటించేవారంతా వ్యభిచారులు కాదని.. ప్రభాకర్ రెడ్డి వయసుకు నేను గౌరవం ఇస్తానని , అంతే తప్పించి తాను ఎవరికీ భయపడనని ఆమె తేల్చి చెప్పారు. నన్ను కిడ్నాప్ చేసి హత్య చేస్తారా? చంపితే చంపుకోండి అంటూ మాధవీలత సవాల్ విసిరారు. స్క్రీన్పై కనిపించే ఆడవాళ్లు క్యారెక్టర్లెస్, గలీజ్ వాళ్లు అయితే తాడిపత్రిలో ఉండే పతివ్రతలు సినీ రంగంలోకి రావొద్దంటూ ఆమె సెటైర్లు వేశారు. మహిళలపై వైసీపీ నేతలు విమర్శలు చేసినప్పుడు రెచ్చిపోయిన ఓ మీడియా వాళ్లకి నా విషయం కనిపించడం లేదా అని మాధవీలత నిలదీశారు. విలేకరులుగా ఉన్న నా మిత్రుడు కూడా మౌనం దాల్చడం సమ్మతంగా లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని వైపులా విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఆదివారం తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. మాధవీలత గురించి తాను అలాంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. మాధవీలతకు క్షమాపణలు చెబుతున్నానని జేసీ తెలిపారు. ఆవేశంలోనే తాను అలా మాట్లాడానని , మాధవీలత ఇతర బీజేపీ నేతలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. డిసెంబర్ 31న తనను నమ్మి దాదాపు 16 వేల మంది అక్కాచెల్లెళ్లు జేసీ పార్క్కు వచ్చారని.. తాడిపత్రి కోసం ఎంత దూరమైనా వెళ్తానని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే ఇదే మీడియా సమావేశంలో తన ముందున్న టేబుల్పై నోట్ల కట్టలు విసిరేస్తూ ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం దుమారం రేపింది. తాను పిలిస్తే నోట్ల కట్టలు వచ్చి పడతాయని.. డిసెంబర్ 31న వచ్చిన డబ్బును తాడిపత్రి కోసం ఉపయోగిస్తానని , అభివృద్ధి కోసమే తాను టీడీపీలో ఉన్నానని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో తాడిపత్రి రూపురేఖలు మారుస్తానని.. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. మాధవీలతకు క్షమాపణలు సంగతి పక్కనపెడితే.. తాజాగా జేసీ అన్న మాటలు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











