నిర్మాతలు మమ్మల్ని వేధించొద్దు .. టికెట్ రేట్లపై కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటనతో పాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవని స్పష్టం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రధాన మార్కెట్గా ఉన్న నైజాం ఏరియాలో టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు లేకుంటే కష్టం. ఈ విషయం గమనించిన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఒ దఫా ఆయనతో భేటీ అవ్వగా.. టికెట్ ధరల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. దీని ప్రభావం సంక్రాంతికి రిలీజైన డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలపై గట్టిగానే పడింది. తెలంగాణలో టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు లేకపోవడంతో వసూళ్లపై ప్రభావం చూపింది.

ఈ నేపథ్యంలో సినీ నిర్మాత దిల్రాజు సహా పలువురు పరిశ్రమ పెద్దలు పరిస్ధితిని చక్కదిద్దేందుకు శ్రమిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఉండటంతో శతవిధాల కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల పెంపుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా పవన్ కేతరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఎల్ వై ఎఫ్ . మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా , అన్నపరెడ్డి స్టూడియెస్ బ్యానర్లపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ రామస్వామి రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవి బాబు , రియా, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఎల్ వై ఎఫ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

తాజాగా ఈ సినిమా టీజర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్ వై ఎఫ్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలను భారీ బడ్జెట్తో కాకుండా మంచి కంటెంట్తో తెరకెక్కించాలని అప్పుడే సినిమాలు కూడా బాగుంటాయని కోమటిరెడ్డి తెలిపారు. ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీసేసి, తర్వాత టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని అడగటం కంటే తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలని మంత్రి సినీ పరిశ్రమకు సూచించారు.
తక్కువ బడ్జెట్తో వచ్చే సినిమాలకు తన సహకారం ఉంటుందని.. ఇవి థియేటర్లోనైనా, ఓటీటీలోనైనా మంచి విజయం సాధిస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎల్ వై ఎఫ్ మంచి విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











