థియేటర్ల బంద్ వివాదంలో తొలి వికెట్.. జనసేన నేతపై పవన్ కళ్యాణ్ వేటు
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత అంశం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. జూన్ 1న ధియేటర్ల బంద్ నిర్వహించాలని అనుకున్న కొందరు .. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో వెనక్కి తగ్గారనే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదని డిసైడ్ అయిన పవన్ .. దీని వెనుక ఎవరున్నా వదలబోమనే సంకేతాలు ఇచ్చారు. దీనిలో భాగంగా జనసేన పార్టీకి చెందిన కీలక నేత, రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై వేటు వేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
పర్సెంటేజ్ విధానం కావాలంటూ పట్టు
థియేటర్ల బంద్ వివాదం, దానిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండస్ట్రీలోని నలుగురు పెద్ద నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని థియేటర్ల మూసివేత దిశగా పావులు కదిపారంటూ ప్రచారం జరిగింది. సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్కు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. మల్టీప్లెక్స్లలో అమలు చేస్తున్న పర్సెంటేజ్ విధానాన్ని తమకు కూడా వర్తింపజేయాలంటూ థియేటర్ యజమానులు డిమాండ్ చేయడమే అసలు వివాదానికి మూలం.

జూన్ 1న థియేటర్ల బంద్ లేదన్న ఛాంబర్
ఈ వివాదానికి పరిష్కారం దొరక్కముందే జూన్ 1న థియేటర్ల బంద్ అనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ వెంటనే రంగంలోకి దిగడంతో వివాదం కొత్త టర్న్ తీసుకుంది. థియేటర్ల మూసివేత వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిందిగా మంత్రి విచారణకు ఆదేశించారు. ఏపీ సర్కార్ సీరియస్ అయిన నేపథ్యంలో జూన్ 1న ఎలాంటి థియేటర్ల బంద్ లేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. జరుగుతున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సినీ పరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదని ఇంత వరకు ఛాంబర్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడును కానీ, తనను కానీ కలవలేదని మండిపడ్డారు.
ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ సీరియస్
ఇకపై ఎలాంటి విషయమైనా సరే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారా వచ్చినప్పుడే కలుస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అలాగే ఏపీవ్యాప్తంగా థియేటర్లలోని మౌలిక సదుపాయాలు, ఆహారం, టికెట్ల ధరలు అన్నింటిపై తనిఖీలు చేపట్టాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. పవన్ వార్నింగ్తో టాలీవుడ్లో కలకలం రేపింది. బడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్రాజు వంటి వారు మీడియా ముందుకొచ్చి ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని తెలిపారు.
అత్తి సత్యనారాయణపై పవన్ వేటు
ఇక మీడియాతో మాట్లాడుతున్న సమయంలో దిల్రాజు బాంబు పేల్చారు. అసలు థియేటర్ల బంద్ ప్రతిపాదనను తీసుకొచ్చింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత అత్తి సత్తనారాయణే చెప్పడంతో పవన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్ యాక్షన్లోకి దిగారు. రాజమండ్రి నగర జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న అత్తి సత్యనారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. అలాగే రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని, మీపై వచ్చిన ఆరోపణలపై నిజం నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











