Pawan Kalyan : తిరుపతి లడ్డూకు అపచారం.. కనకదుర్గమ్మ ఆలయ మెట్లు కడిగిన పవన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ తయారుచేసిన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా వార్తలు రావడం దేశంలోని కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. ఈ వార్త బయటికొచ్చిన నాటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. తాజాగా మరో కార్యక్రమాన్ని పవన్ చేపట్టారు.
ఇప్పటికే ట్విట్టర్లో ఓ హిందూ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై పవన్ స్పందించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.

ఆ వెంటనే తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ 11 రోజుల దీక్షను ప్రారంభించారు. ఆదివారం ఉదయం మంగళగిరి సమీపంలోని దశావతర వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ వెంటనే దీక్షకు దిగారు. 11 రోజుల దీక్ష అనంతరం అక్టోబర్ 1న తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. 2న ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆ వెంటనే దీక్ష విరమించనున్నారు.
మరోవైపు.. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్ధతు పెరుగుతోంది. ఆయన దీక్షకు మద్ధతుగా సెప్టెంబర్ 24న గుంటూరు నగరంలోని గోరంట్లలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో 111 మంది జనసేన నేతలు దీక్ష చేపడతారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మొత్తం 9 రోజుల పాటు దీక్ష అనంతరం అనంతవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష విరమిస్తారని వారు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులే అయ్యిందని , ఇంతలోనే హామీలు ఎలా అమలవుతాయని వారు ప్రశ్నించారు.
VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan) performs a purification ritual at Sri Durga Malleswara Swamy Varla Devasthanam in Vijayawada. He has begun his 11-day ‘Praschit Deeksha’ (penance) amid controversy over the alleged adulteration of animal fat in the… pic.twitter.com/wKgaMa3GDP
— Press Trust of India (@PTI_News) September 24, 2024
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మంగళవారం మరో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. మెట్లను స్వయంగా కడిగిన పవన్.. పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు. ఆయన వెంట విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, బందరు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు. అటు తిరుమల ఆలయంలోనూ వేదపండితులు యాగశాలలో శుద్ధి, శాంతి హోమాలను నిర్వహించారు. ఉగ్రాణం, లడ్డూ విక్రయశాల, బూందీ తయారీ పోటుల వద్ద సంప్రోక్షణ చేశారు.


Click it and Unblock the Notifications











