చంద్రబాబును కలవనున్న జూ.ఎన్టీఆర్.. లాంగ్ గ్యాప్ తర్వాత మామయ్య ఇంటికి
నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆ కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు ఎన్టీఆర్కు.. బాలకృష్ణకు ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ పెరిగింది. పలు సందర్భాల్లో వేదికలపై కలిసే అవకాశం వచ్చినా వీరు ఒకరికొకరు కలుసుకోలేదు. ముఖ్యంగా తాత పెట్టిన తెలుగుదేశానికి, ఆ పార్టీ మనుషులకు జూనియర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. అలాంటిది చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం , స్వయానా మేనమామ చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్టీఆర్ వెళ్లనున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
2009 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు, తెలుగుదేశానికి దూరమయ్యారు ఎన్టీఆర్. రాజకీయాలను పక్కనబెట్టి తన సినిమాలు తాను చేసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. ఇలాంటి దశలో అన్న జానకీరామ్, తండ్రి హరికృష్ణ మరణంతో ఆయన బాగా కృంగిపోయారు. కుటుంబం నుంచి పెద్దగా ఎవరూ అండగా నిలిచిన దాఖలాలు లేవు. కేవలం తన అన్నయ్య కళ్యాణ్రామ్తోనే కష్టసుఖాలు పంచుకుంటున్నారు ఎన్టీఆర్.

నందమూరి కుటుంబంలో తాత తండ్రి తర్వాత బాబాయ్ బాలయ్యను ఎక్కువగా అభిమానిస్తారు జూనియర్ ఎన్టీఆర్. అలాంటిది జూనియర్కి బాబాయ్కి ఈ మధ్య రిలేషన్స్ సరిగా లేవంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఎన్టీఆర్ - బాలయ్య మధ్య సంబంధాలు దెబ్బతినడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ను బాలకృష్ణ దూరం పెడుతున్నారని రాజకీయ వర్గాల టాక్. తన మేనత్త నారా భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే , ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించదని కూడా చెబుతుంటారు. టీడీపీకి చావోరేవో వంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ కనీసం మాట మాత్రంగానైనా సపోర్ట్ చేయకపోవడం కూడా తెలుగుదేశం వర్గాలను , బాలయ్యను బాగా డిజప్పాయింట్ చేసిందట.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని పరాజయాన్ని చవిచూసింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి తోడు జగన్ తన సమస్త సైన్యాలను ఉపయోగించి టీడీపీ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టడంతో పార్టీ బతికి బట్టకడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్కు అప్పగించాలని అభిమానులు, నేతలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో చంద్రబాబు, లోకేష్లు బాగా ఇబ్బందిపడగా.. ఎన్టీఆర్పై గ్యాప్ మరింత పెరిగిందని విశ్లేషకులు చెబుతారు.

ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతుండటం సినీ , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఏపీలో వరద బాధితులకు ఆయన రూ.50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్ను అందించేందుకు చంద్రబాబు నివాసానికి తారక్ వెళ్లనున్నారు. ఆయనతో పాటు మిత్రుడు, మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా సీఎంను కలవనున్నారు. చెర్రీ కూడా వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మేనమామను చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కలవనుండటంతో ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారోనని ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











